బిజెపికి పెద్ద షాక్ తగలబోతోంది. పార్టీలో సీనియర్ నేత, ఆర్ఎస్ఎస్ లో కీలకంగా ఉంటున్న మాజీ ఎంపి గోకరాజు గంగరాజు వైసిపిలో చేరుతున్నారు. ఈ మేరకు రంగం కూడా సిద్ధమైంది. తన కొడుకు గోకరాజు రంగరాజు, సోదరులతో సహా మాజీ ఎంపి వైసిపి కండువా కప్పుకోబోతున్నారు. ఆర్ఎస్ఎస్ తో గోకరాజుకు బలమైన అనుబంధముంది. ఈయన పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు అత్యంత సన్నిహితుడు.
కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా వైసిపి నేతలను తమ పార్టీలోకి లాక్కోవాలని బిజెపి ప్రయత్నాలు చేస్తోంది. అయితే పెద్దగా సక్సెస్ కావటం లేదు. ఇందులో భాగంగానే బిజెపి నేతల దృష్టి టిడిపిపై పడింది. సరే ఇప్పటికే కొందరు బిజెపిలో చేరిపోయారు. మరికొందరు అదే బాటలో ఉన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడితో వైసిపి నరసాపురం ఎంపి రఘురామ కృష్టంరాజు పార్లమెంటులో సన్నిహితంగా ఉంటున్న కారణంగా ఆయన బిజెపిలో చేరుతారా అనే అనుమానం అందరిలోను కలిగుతోంది. అయితే ఆ విషయంలో ఎవరికీ క్లారిటీ అయితే లేదు. అయితే ఇంతలోనే బిజెపి మాజీ ఎంపి గోకరాజు వైసిపిలో చేరటం ఖాయమైపోయింది. ఈ రోజు సాయంత్రమే తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి క్యాంపాఫీసులో కుటుంబసభ్యులతో కలిసి పార్టీలో చేరనున్నారు.
గోకరాజు వైసిపిలో చేరటమంటే బిజెపికి పెద్ద దెబ్బనే చెప్పాలి. ఎందుకంటే క్షత్రియ సామాజికవర్గంలో గోకరాజుకు గట్టి పట్టుంది. పైగా ఆర్ధికంగా మంచి పటిష్టమైన స్ధితిలో ఉన్నాడు. ఆర్ఎస్ఎస్ తో దశాబ్దాలుగా బాగా అనుబంధమున్నవాడు. అందుకనే నరేంద్రమోడి, అమిత్ షా లతో కూడా బాగా సన్నిహితముంది.
కాకపోతే కరకట్ట మీద నిర్మించిన అక్రమ నిర్మాణాల్లో గోకరాజు గెస్ట్ హౌస్ కూడా ఉంది. దీన్ని కూడా కూల్చేయాలని జగన్ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో ఉంది. మరి ఈ నేపధ్యంలోనే గోకరాజు అధికారపార్టీలో చేరుతుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో.