రెండు రోజుల కిందట వైసీపీలో చెలరేగిన ఆనం వ్యాఖ్యల మంట.. టీకప్పులో తుఫాను మాదిరిగా సమసిపో యిందా? నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి, వైసీపీ అధినేత, సీఎం జగన్కు మధ్య ఏర్పడిన గ్యాప్ సమసిపోయిందా? అంటే. తాజా పరిణామాలను బట్టి.. ఔననే అంటున్నారు పరిశీలు కు.. ``నెల్లూరు నగరాన్ని మాఫియాకు అప్పగించారని, రైడీలు పాలిస్తున్నారని`` ఆనం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జగన్కు అత్యంత సన్నిహితుడు, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్పై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం సృష్టించాయి.
దీంతో జగన్ సీరియస్ అయ్యారని, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డితో సంజాయిషీ కోరుతూ.. ఆనంకు నోటీసులు రాజీ అయ్యాయని, త్వరలోనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయనున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే వీటికి ఫుల్ స్టాప్ పడే ఘటన తాజాగా సోమవారం అసెంబ్లీలో చోటు చేసుకుంది. తొలి రోజు సభలో ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో కలుగ జేసుకున్న ఆనం.. ప్రశ్నోత్తరాల సమయంలో ఆందోళన చేస్తారా..? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కొత్త సంప్రదాయానికి తెర తీస్తోందని విమర్శలు గుప్పించారు. ప్రశ్నోత్తరాలలో నిరసన తెలిపే సంప్రదాయం లేదని ఆయన చెప్పుకొచ్చారు. విద్యుత్ ఒప్పందాలపై ఇప్పటికే ప్రభుత్వం సరైన సమాధానం ఇచ్చిందన్నారు. విద్యుత్పై టీడీపీది సరైన వాదన కాదన్నారు.
అదే సమయంలో.. ఆనం వ్యంగ్యాస్త్రాలు సంధించారు.. ‘దయచేసి నా సీటు మార్చండి సార్.. సభ్యులు ఎవరైనా మాట్లాడితే మాట్లాడుతాను కానీ.. ప్రతిపక్ష నేతే నా పక్కన నిలబడితే నేనేం మాట్లాడగలను సార్.. ఆయన నా పక్కన నిల్చున్నా.. కూర్చున్నా మాట్లాడేంత ధైర్యం, శక్తి నాకుందా సార్.. వారి ముందు నేను చాలా చిన్నవాణ్ణి.. వారొచ్చి నా పక్కన నిల్చుంటే నేనేం మాట్లాడగలను. దయచేసి అరాచక శక్తులు అనే పదం వారు ఉపసంహరించుకోమని చెప్పండి లేదా మీరైనా (స్పీకర్) రికార్డ్స్లో నుంచి తొలగించండి’ అని ఆనం ఒకింత సెటైరికల్గా మాట్లాడారు. దీంతో సభలోనే ఉన్న సీఎం జగన్.. ఆనం మాటలకు ఆది నుంచి నవ్వుతూనే ఉండడం గమనార్హం. దీంతో ఆనం-జగన్ల మధ్య ఒక అండర్ స్టాండింగ్ కుదిరిందని అంటున్నారు పరిశీలకులు. సో.. మొత్తానికి ఆనం రగడ టీకప్పులో తుఫాన్ మాదిరిగా తేలిపోయిందని అంటున్నారు.