తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడైన ఆ పార్టీ యువనేత నారా లోకేష్ గురించి ఇప్పటికే రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన విశ్లేషణ సాగుతున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండటం, ముఖ్య నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్తూ ఇతర పార్టీల్లో చేరిపోతున్న తరుణంలో... ఓ వైపు చంద్రబాబు నాయకత్వ సామర్థ్యంపైనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, అదే సమయంలో పార్టీని లోకేష్ రాబోయే కాలంలో నడిపించగలడా అనే అనుమానంతో కూడిన చర్చ కూడా జరుగుతోంది. ఇందుకు అనేక ఉదంతాలు పలువురు పేర్కొంటున్నారు. అయితే, తాజాగా తన తండ్రి, ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడును లోకేష్ను ఇరకాటంలో పడేశారని అంటున్నారు.
ఉల్లి కొరతపై అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హాట్ హాట్ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే... టీడీపీ సభ్యులు అసెంబ్లీలో ఆందోళన చేశారు. టీడీపీ సభ్యుల ఉల్లి కొరత ఆందోళనపై స్పందించిన సీఎం జగన్.. దేశంలో ఎక్కడా లేని విధంగా సబ్సిడీపై ఉల్లిని ఏపీలో మాత్రమే విక్రయిస్తున్నామని వెల్లడించారు. ఏపీలోని ప్రతీ రైతు బజార్లో ఉల్లి అందుబాటులో ఉందని స్పష్టం చేసిన ఆయన.. ఏపీలో కొనుగోలు చేయడానికి అవకాశం లేకపోతే సోలాపూర్ నుంచి ఎక్కువ ధరకు కొనుగోలు చేసి సబ్సిడీపై అందిస్తున్నామని గుర్తుచేశారు. హెరిటేజ్ సూపర్ మార్కెట్లో కేజీ ఉల్లి రూ.200కు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.
ఇంత జరిగిన తర్వాత.....తమ సొంత సంస్థలో భారీ స్థాయిలో అమ్మకాల నిర్వాకం గురించి స్పందించాల్సిన నారా లోకేష్ అందుకు భిన్నంగా స్పందించారు. ఏపీ సీఎం ఉల్లి కొరతపై చర్చ జరపడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటిస్తే... ఆ చర్చలో అడ్డంగా తెలుగుదేశం బుక్కయ్యేలా లోకేష్ చేశారు. పలు ట్వీట్లలో లోకేష్ ఉల్లి అంశాలను ప్రస్తావించారు. ``పేద ప్రజలపై @ysjagan గారికి అంత కక్ష ఎందుకో! జగన్ గారి అసమర్థ పాలన కారణంగా ఉల్లి కోసం సామాన్యులు అల్లాడుతున్నారు. కేజీ ఉల్లి కోసం క్యూలైన్లలో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గుడివాడ రైతు బజార్లో క్యూ లైన్లో నిలబడి సాంబయ్యగారు మృతి చెందిన ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రభుత్వం ధరలు నియంత్రించి, ప్రజలకు తక్కువ ధరకు ఉల్లి అందించాలని డిమాండ్ చేస్తున్నాం. కేజీ ఉల్లి కోసం రాష్ట్రంలో మహిళలు పడుతున్న కష్టాలను, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అసెంబ్లీ ఎదురుగా ధర్నా నిర్వహించాం. ఉల్లి కోసం మహిళలు క్యూ లైన్లలో నిలబడి సొమ్మసిల్లుతున్నారు. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న సబ్సిడీ ఉల్లి ప్రజలకు అందడం లేదు.`` అని ట్వీట్లు చేశారు. అయితే, ఇన్ని మాట్లాడిన నారా లోకేష్ తమ సంస్థలో జరుగుతున్న అధిక ధరల అమ్మకం గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అందరి దృష్టి హెరిటేజ్ ధరలపై పడగా....మళ్లీ తమ సంస్థ అధిక ధరలను ప్రస్తావించారని అంటున్నారు.