భారతదేశంలో సౌదీ అరేబియా రాయబారి సవూద్ బిన్ మహమ్మద్ అస్సతి, తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావుతో భేటీ అయ్యారు. తెలంగాణ హోం శాఖ మంత్రి మహమ్మద్ అలీతో పాటు మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎ.కె ఖాన్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్తో కలిసి ప్రగతి భవన్లో ఆయన సమావేశం అయ్యారు.
తెలంగాణ రాష్ట్రం గత ఐదు సంవత్సరాలుగా అద్భుతమైన ప్రగతి సాధించిందని, ఇక్కడ అనేక రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు సౌదీరాయబారికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఐపాస్ విధానం ద్వారా ఇప్పటికే ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలను తెలంగాణ తెేవడంలో విజయం సాధించిందని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు సౌదీ అరేబియా పారిశ్రామిక వర్గాల్లో తెలంగాణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలని ఈ సందర్భంగా కేటీఆర్ కోరారు. ఇందుకోసం అవసరమైతే తెలంగాణలోని మౌళిక వసతులు, ఐటి, పరిశ్రమల వర్గాల ప్రతినిధులతో కలిసి సౌదిలో పర్యటిస్తామని, తద్వారా ఇక్కడకి సౌదీ పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నిస్తామని, ఇందుకోసం సహాకరించాలని రాయబారి సవూద్ను మంత్రి కోరారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ లో తెలంగాణ అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్నది అని, జీవించడానికి భారతదేశంలో ఉన్న అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో కొనసాగుతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం పెద్ద ఎత్తున సౌదీకి ఇక్కడి పౌరులు వెళ్తారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకి సౌదీకి మధ్య సాంస్కృతిక సంబంధాలకు మంచి చరిత్ర ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. ముందు నుంచి మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలోహైదరాబాద్ నగరంలో సౌదీ కాన్సులేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సౌదీ రాయబారిని కోరారు. పెట్టుబడులు పెట్టేందుకు సౌదీలో కూడా మంచి అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు.