పాస్పోర్ట్ అంటే ఒక దేశ పౌరసత్వానికి గుర్తింపు పత్రంగా మనం భావిస్తాం. ఎవరు దేశ సరిహద్దులు దాటాలన్నా పాస్పోర్ట్ తప్పనిసరి. అయితే పాస్పోర్టులు దేశాల ఆర్థిక వృద్ధిని నియంత్రణలో ఉంచేందుకూ ఉపయోగపడుతున్నాయి. అదెలాగంటే. ప్రస్తుతం ధనిక దేశాలు తమ దేశంలోకి నైపుణ్యం లేని కార్మికులు రాకుండా సరిహద్దులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. కానీ, ఒకప్పుడు నిపుణులు బయటకు వెళ్లకుండా ఆపేందుకు దేశాలు సరిహద్దులను ఏర్పాటు చేసుకునేవి.
19వ శతాబ్దంలో అమెరికా వెళ్లాలంటే పాస్పోర్ట్ అవసరం ఉండేది కాదు. తమ దేశానికి ఎవరైనా రావొచ్చంటూ అప్పటి పాలకులు ఆహ్వానించేవారు. ఫ్రాన్స్లోనూ అలాంటి విధానమే ఉండేది. చైనా, జపాన్లలో వ్యాపారాలు చేయాలనుకునే విదేశీయులకు మాత్రమే పాస్పోర్ట్ అవసరమయ్యేది. కానీ, ఆ తర్వాత పరిస్థితులు క్రమంగా మారుతూ వచ్చాయి. 20వ శతాబ్దం చివరి నాటికి కొన్ని దేశాలు తమ సరిహద్దు దాటేందుకు పాస్పోర్టులు తప్పనిసరి చేశాయి. ప్రస్తుతం అతి కొద్ది మిత్ర దేశాల మధ్య మాత్రమే పాస్పోర్ట్ లేకుండా ప్రయాణాలు చేసే వీలుంది.
పాస్పోర్ట్ల ద్వారా వలసదారుల వ్యక్తిగత వివరాలతో పాటు వారి నైపుణ్యాలనూ బేరీజు వేస్తున్నాయి. నైపుణ్యం లేని కార్మికులను అడ్డుకుంటూ సంపదను సృష్టించగలిగే ప్రత్యేక నిపుణులకు మాత్రం ఆహ్వానం పలకుతున్నాయి. కొన్ని దేశాల్లో వలసల నియంత్రణ వెనక రాజకీయ ప్రయోజనాలూ ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శరణార్థులను కాకుండా మెరుగైన కొలువులు, జీతాల కోసం వచ్చే వారిని అడ్డుకోవాలన్న విషయంపై యూరప్లో రాజకీయ చర్చలు నడుస్తున్నాయి.
తక్కువ వేతనాలకు పనిచేసేవారు వలస వస్తే ఉత్పత్తి పెరుగుతుంది. ఆయా ఉత్పత్తుల ధరలు తగ్గి అందరూ కొనే స్థాయికి రావచ్చు. కానీ స్థానికులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంటుంది. అది నిరుద్యోగ సమస్యలకు దారి తీస్తుంది. అలాగే పెరిగే జనాభాకు తగ్గట్లుగా ప్రభుత్వ వ్యవస్థలు మెరుగుపడాలి. మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఈ భారమెందుకులే అన్న ఆలోచనతోనూ కొన్ని దేశాలు వలసలదారులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి.