ప్రేమ పిచ్చి ముదిరితే మనిషి ఉన్మాదిగా మారుతాడని అంటారు. ఆ ఉన్మాదంలో ఎదుటివారి గురించి ఆలోచించ కుండా వారి మనోభావాలతో సంబంధం లేకుండా ఇష్టారీతిగా ప్రవర్తిస్తాడు. తాను చేస్తున్న పనివల్ల తాను ఇబ్బందుల్లో పడటమే కాదు. తన ఎదుటివారికి కూడా సమస్యగా మారుతాడు. ఈ మద్యకాలంలో ప్రేమికుల పిచ్చి చేష్టలను గురించి తరుచుగా వార్తల్లో వింటూనే ఉన్నాం. ప్రేమించిన ప్రియురాలు దక్కలేదని, దాడికి పాల్పడటం, లేదా కలిసి ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేయడం ఇలాంటి వికృతమైన చర్యలు ఎన్నో ప్రేమికులు చేస్తున్నారు.

 

 

ప్రేమ అంటే ప్రేమను పంచడంతో పాటు ఆ ప్రేమను అదే స్దాయిలో పొందడం ఇదే నిజమైన ప్రేమ. కాని ఒక సారి వద్దనుకున్నాక వారి వెంటపడి వేధించడం, ప్రేమించిన వారిని మానసికంగా హింసించడం ఇది నిజమైన ప్రేమికులకు తగదు. ఇలాంటి చర్యవల్ల ఇద్దరి మద్య ఉన్న కాస్తకూస్తో ప్రేమలు కూడా కఠినంగా మారుతాయి. ఇకపోతే ఓ యువతి బస్సులో వెళ్లుచుండగా బలవంతంగా తాళి కట్టిన యువకుణ్ని పోలీసులు అరెస్టు చేసారు. వారు తెలిపిన వివరాలు పరిశీలిస్తే ..

 

 

ఆంబూరు సమీపంలోని సాండ్రోర్‌ కుప్పం ప్రాంతానికి చెందిన జగన్‌ అనే యువకుడు స్థానికంగా ఉంటున్న ఓ యువతిని కళాశాలలో చదువుతున్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాడట, కానీ ఈ విషయం ఆమెకు చెప్పలేదని పోలీసులు పేర్కొన్నారు. అయితే ఇటీవల ఆమెకు వివాహం నిశ్చమైందని, ఈ విషయం తెలుసుకుని ప్రేమిస్తున్నట్లు చెప్పాడన్నారు.

 

 

అందుకు ఆమె నిరాకరించడంతో ఆ యువతి పై ఆగ్రహంతో ఉన్న అతను మంగళవారం ఉదయం ఆంబూరు నుంచి వాణియంబాడికి ఆ యువతి బస్సులో బయలుదేరగా, అదే బస్సులో అతడు కూడా ఎక్కి సమయం చూసుకుని ఆమె వద్దకు వెళ్లి తనవెంట తెచ్చుకున్న తాళిని ఆమె మెడలో కట్టాడని చెప్పారు.

 

 

ఊహించని ఈ పరిణామానికి బిత్తరపోయిన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో ప్రయాణికులు నిందితుణ్ని పట్టుకొని దేహశుద్ధి చేసిన అనంతరం తమకు అప్పగించారని వాణియంబాడి పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని వారు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: