అమెరికాలో మరోసారి గన్ కల్చర్ కి ప్రాణాలు వదిలారు. ఈ మధ్య కాలంలో తరచుగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా  అమెరికాలోని న్యూజెర్సీలోని జెర్సీ నగరంలో జరిగిన కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ముగ్గురు పౌరులు, ఇద్దరు దుండగులు, ఒక పోలీస్ అధికారి ఉన్నారు. మరో ఇద్దరు పోలీస్ అధికారులు, ఓ పౌరుడు గాయపడ్డారు. నగరంలోని ఓ మాల్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది.  

 

ఓ ట్రక్కులో అక్కడకు వచ్చిన దుండగులు ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించడంతో అనేక మంది దుకాణంలో చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకోగా.. ముష్కరులు వారిపైకి కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు, దుండగుల మధ్య గంటలపాటు భీకర ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల మోతతో జెర్సీ వీధులు దద్దరిల్లాయి. కాల్పుల నేపథ్యంలో స్థానిక పాఠశాలలు, ఇతర దుకాణాలు వెంటనే మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అధికారి గతంలో గన్ కల్చర్ నిర్మూలనకు కృషి చేశారు. జెర్సీ నగర పబ్లిక్ సేఫ్టీ డైరెక్టర్ జేమ్స్ షియో మాట్లాడుతూ.. కాల్పులు ఘటనతో ఉగ్రవాదులకు సంబంధం లేదని, విచారణ కొనసాగుతోందని తెలిపారు. గాయపడిన ఇద్దరు పోలీస్ అధికారులు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినట్టు పేర్కొన్నారు. 

 

కాల్పుల ఘటనపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. ఇదో ఓ భయంకరమైన ఘటనగా అభివర్ణించిన ఆయన.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అక్కడి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ.. అవసరమైన సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. 

 

నాలుగు రోజుల కిందట హవాయిలోని చారిత్రక పెరల్‌ హార్బర్‌లో ఓ అమెరికా సైనికుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మరణించగా, మరొకరు గాయపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నిందితుడు తను తాను కాల్పుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో భారత వైమానిక దళాధిపతి ఆర్కే భదౌరియా సైతం అక్కడే ఉన్నారు. పెరల్‌ హార్బర్‌ వేదికగా నిర్వహించిన పసిఫిక్‌ దేశాల వైమానిక దళాధిపతుల సమావేశంలో పాల్గొనేందుకు భదౌరియా అక్కడికి వెళ్లారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: