రాజధాని మార్పుపై సందిగ్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల ప్రక్రియను మొదలుపెట్టిన ప్రభుత్వం ముందుగా ప్రజాభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది. ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ కమిటీ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పర్యటించింది. దాదాపు 40 వేల సూచనలు కమిటీకి అందినట్లుగా తెలుస్తోంది. అందులో ఎక్కువమంది ప్రస్తుతమున్న అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పేర్కొన్నట్లు సమాచారం.
రాజధానితో పాటుగా నగరాలు..పట్టణాల అభివృద్ధి పైన ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు కోరుతుండటం విశేషం. అభివృద్ధి వికేంద్రీకరణ జరిగితే ప్రాంతాల మధ్య వైషమ్యాలు ఉండవని ప్రభుత్వం నిపుణులతో కూడిన కమిటీకి నేతృత్వం వహిస్తున్న రిటైర్డ్ ఐఏయస్ జీఎన్ రావుకు విజ్ఞప్తి చేస్తున్నారట. వికేంద్రీకరణకు పెద్దపీట వేయాలని చెబుతున్న వారు 1950 దశకంలో కుదిరిన శ్రీబాగ్ ఒప్పందాన్ని తెరపైకి తెస్తున్నారు. ఆ ఒప్పందాన్ని అనుసరించి రాష్ట్ర హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ మొత్తం సమాచారంతో పాటుగా సలహాలు..సూచనలతో కూడిన నివేదిక ఈ నెల 20న ప్రభుత్వానికి అందించే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా రాజధాని రెండో ప్రత్యామ్నాయంగా విశాఖ వైపు ప్రజలు మొగ్గు చూపుతుండటానికి ప్రధాన కారణం ఇప్పటికే ఐటీ హబ్గా పేరు గడించడం ఒకటయితే పట్టణాభివృద్ధి జరిగి ఉండటాన్ని గుర్తు చేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ భూములకు కొదవలేదు. పైగా వెనక పడ్డ ఉత్తరాంధ్ర లో కీలక నగరంగా ఉన్న విశాఖ భవిష్యత్తు లో దేశ స్థాయిలో అభివృద్ధి చెందుతుంది.
భౌగోళికపరమైన పలు సానుకూలతలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం, మనోల్లాసాన్నిచ్చే సముద్రతీరం ఉండటం వల్ల పర్యటక రంగంలోనూ మంచి అభివృద్ధి సాధించినట్లవుతుందని విన్నవిస్తున్నారట. కేంద్ర, రాష్ట్రస్థాయి సంస్థలు పెద్దసంఖ్యలో కొలువు దీరి ఉండటాన్ని గుర్తు చేస్తున్నారు. ఏపీ రాజధాని అయ్యేందుకు విశాఖపట్నం అన్ని విధాలుగా అర్హతలు కలిగి ఉందని నొక్కి చెబుతున్నారు.