ఇటీవల కాలంలో మాములు గొడవల కారణంగా కోర్టుకు వెళ్లేవాళ్ల సంఖ్యకంటే విడాకుల కేసుల విషయంలో కోర్టు చుట్టూ తిరుగుతున్నా వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. ఇంకా కోర్టులోనే ఉన్న కేసులు కోకొల్లలుగా ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ లోనే మూడు ఫామిలీ కోర్టులు ఉన్నాయి. అయినప్పటికీ కేసుల సంఖ్య తగ్గడం లేదు. పైగా రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నది.
రోజుకు పది కేసులు పరిష్కరిస్తే... వందకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇంకెక్కడి నుంచి కేసుల సంఖ్య తగ్గిపోతుంది చెప్పండి. ఇప్పుడు ఈ విషయంలో కొంత మార్పుకు కూడా వచ్చింది. సమస్యను కొంతమంది పెద్దల సమక్షంలోనే పరిష్కరించుకుంటున్నారు. అది వేరే విషయం అనుకోండి. ఇక ఇదిలా ఉంటె, మూడేళ్ళ క్రితం ఓ వ్యక్తి హైదరాబాద్ లోని ఫ్యామిలీ కోర్టులో కేసు ఫైల్ చేశాడు.
తనకు తన భార్య నుంచి విడాకులు కావాలని కోరుతూ కేసు దాఖలు చేశారు. ఈ కేసు ఫైల్ చేసి మూడేళ్లు దాటింది. కానీ, ఇంతవరకు కేసుకు సంబంధించిన ఎలాంటి పురోగతి కనిపించలేదు. వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. ఇలా వాయిదాలు వేస్తూ సమయం వృధా అవుతుండటంతో పాపం సదరు పిటిషనర్ బెంచ్ క్లర్క్ రామకృష్ణను కలిశారు.
అలా రామకృష్ణను కలిసిన తరువాత కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. కేసు త్వరగా పూర్తి కావాలి అంటే... తనకు ఓ బైక్, జడ్జి గారికి 15 లక్షల రూపాయలు డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విడాకుల కోసం కోర్టుకు వెళితే అడిగిన ఉద్యోగిని చూసి షాక్ అయ్యాడు. వెంటనే తేరుకొని, సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి అనిశాను కలిశారు. దీంతో రంగంలోకి దిగిన అనిశా... గాలం వేసి లంచగొండి ఉద్యోగి రామకృష్ణను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.