మానవ మృగాల బారిన పడి దారుణ హత్యకు గురైన బాధితురాలి విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలం ఎల్లపటూర్ గ్రామానికి చెందిన దళిత మహిళ.. గత నెల 24న ముగ్గురు దుండగుల చేతిలో హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. హత్యకు గురైన ఆ మహిళ పేరు టేకులక్ష్మీ కాగా.. కలెక్టర్ కార్యాలయం ఆమె పేరును ‘సమత’గా మార్చింది. వారి కుటుంబ గౌరవ నిమిత్తం పేరు మార్చినట్లు కలెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. తాజాగా సమత కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు హైకోర్టు ఆమోదం తెలిపింది. దీంతో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తూ న్యాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
బైక్ వాడుతున్నారా..పోలీసులు ఇంకో దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్నారు
దిశ ఘటన తర్వాత ప్రభుత్వం వేగంగా స్పందించిందని, సమత కేసులో కూడా సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసింది. ఐదవ అదనపు సెషన్స్, ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానాన్ని ప్రత్యేక కోర్టుగా ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. సమత కేసులో ప్రత్యేక కోర్టు ఏర్పాటు కావడంతో రోజువారీ పద్ధతిలో విచారణ జరిపి, నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నట్లు న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. దోషులకు వెంటనే శిక్షలు పడేలా, భాదితులకు సత్వర న్యాయ జరిగేలా ప్రభుత్వం తమ వంతుగా కృషి చేస్తుందన్నారు.
హైదరాబాద్ మెట్రోలో ఫ్రీ వైఫై...అసలు షాక్ ఏంటో తెలుసా?
కాగా, సమత కేసుకు సంబంధించి వారం రోజుల్లో చార్జీషీట్-ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు తెలిపారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా ప్రభుత్వం నుంచి సహాయం అదుతుందని కలెక్టర్ తెలియజేశారు. ఈ కేసు నమోదయిన నుంచి పోలీసులు అన్ని సాక్ష్యాలు సేకరించారు. ఈ ఘోరానికి పాల్పడ్డ దోషులను వెంటనే అరెస్టు చేసి, వారికి వైద్య పరీక్షలు నిర్వహించి సంబంధిత ప్రభుత్వ వైద్యుల నుంచి నివేదిక తీసుకోవడం జరిగిందని ఎస్పీ మల్లారెడ్డి తెలియజేశారు. ఈ కేసును సవాలుగా స్వీకరించిన జిల్లా ఎస్పీ ఈ వారాంతానికి అన్ని సాక్ష్యాధారాలతో కోర్టులో ప్రవేశపెట్టి దారుణానికి ఒడిగట్టిన దోషులను కఠినంగా శిక్ష పడేలా చేస్తామని జిల్లా ఉన్నతాధికారులు తెలిపారు.
ఇదిలాఉండగా, ఈ కేసుకు సంబంధించి కలెక్టర్ కార్యాలయం ప్రభుత్వానికి నివేదిక పంపింది. ఈ కేసులో బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం అందించారు. చార్జీషీటు దాఖలు చేసిన అనంతరం ఇంకా రావాల్సిన పరిహారం అందనుంది. మృతురాలి ఇద్దరు పిల్లలను తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో చేర్పించి విద్య అందించాలని కలెక్టర్ ఆదేశించారు. మృతురాలి భర్తకు ప్రభుత్వ ఉద్యోగం, కుటుంబానికి ప్రతినెలా పెన్షన్, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వడానికి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు.