బలవంతంగా మూడుముళ్లేస్తే పెళ్లవుతుందా? ఇష్టం లేకుండా తాళికడితే భార్యగా మారుతుందా ?  తమిళనాడులో ఓ యువతికి బలవంతంగా తాళి కట్టాడో వ్యక్తి. బస్సులో వెనుకనుంచి తాళి కట్టిన అతగాన్ని, చితకబాది పోలీసులకు అప్పగించారు స్థానికులు. తన ప్రేమను అంగీకరించలేదనీ.. మరొకరితో పెళ్లికి సిద్ధపడిందనే అక్కసుతో ఓ యువతికి తాళి కట్టేశాడో వ్యక్తి. ఆమె బస్సులో వెళుతుండగా అదే బస్సు ఎక్కిన యువకుడు  ఆమె మెడలో బలవంతంగా తాళిని కట్టేశాడు. ఈ ఘటన తమిళనాడు తిరుపత్తూరు జిల్లా ఆంబూరు శాండ్రోర్ కుప్పంలో జరిగింది. 

 

శాండ్రోర్‌ కుప్పానికి చెందిన జగన్ అనే  యువకుడు కాలేజీలో చదువుకునే రోజులనుంచి ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. కానీ ఇష్టం లేదని ఆమె తేల్చేసింది. కానీ పదే పదే ప్రేమ ప్రేమ అంటూ ఆమె వెంట పడేవాడు. కానీ ఆమె..ఓ ఫ్రెండ్ గా చూశాను తప్ప ఎప్పుడూ ప్రేమించలేదని స్పష్టంగా చెప్పేసింది. కానీ అతను మాత్రం పట్టువదల్లేదు.  ప్రేమించాల్సిందేనని వెంటపడటం మానలేదు. 

 

ఆ వ్యక్తి ఎంత వెంటపడ్డా... ఆమె పట్టించుకోలేదు. ఇద్దరి కులాలు వేరు మా ఇంట్లో ఒప్పుకోరు అంటూ తీవ్రంగానే చెప్పింది. ఈ క్రమంలో ఆమెకు మరో యువకుడితో పెళ్లి కుదిరింది. పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగింది. విషయం తెలుసుకున్న జగన్..ఆమెను ఫాలో అయ్యాడు. సినిమా స్టైల్లో ... బలవంతంగా పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాడు. జేబులో తాళి పెట్టుకుని తిరగబటం మొదలు పెట్టాడు. తాను ప్రేమించిన యువతి ఎక్కడ కనపడితే అక్కడ తాళి కట్టాలని భావించాడు.

 

ఎప్పటిలాగే ఆంబూరు నుంచి వాణియంబాడికి బస్సులో వెళుతున్న ఆ యువతి ఎక్కిన బస్సులోనే ఎక్కాడా యువకుడు. సరిగ్గా ఆమెకు వెనుక సీట్లో కూర్చున్నాడు. అదను చూసి జేబులో నుంచి తాళి తీసి వెనుక నుంచి యువతి మెడలో  బలవంతంగా కట్టేశాడు. హఠాత్తుగా మెడలో తాళికట్టడంతో, ఆమె కేకలు వేసింది. యువతి అరుపులతో తోటి ప్రయాణికులు జగన్ ను పట్టుకుని, చితకబాదారు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. వాణియంబాడి పోలీసులు వెంటనే వచ్చి జగన్ ను అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: