తెలంగాణ లో జరిగిన వెటర్నరీ డాక్టర్ హత్యాచారం తరువాత అలాంటి నేరాలు చేయడానికే వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు ఉండాలని, చట్టాల బూజు దులపాలని చాలా మంది డిమాండ్ చేశారు. ఏపీ మహిళల భద్రత కోసం రూపొందించిన చరిత్రాత్మక ముసాయిదా బిల్లుకు జగన్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దిశ ఘటన నేపథ్యంలో.... మహిళలపై అత్యాచారాలు, నేరాలకు పాల్పడే వారికి సత్వరమే కఠిన శిక్ష విధించేలా చట్టం తీసుకొస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో  ఇది వరకే ప్రకటించారు. 

 

దానికి అనుగుణంగా గురువారం భేటీ అయిన ఏపీ కేబినెట్.. ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా చట్ట సవరణ బిల్లు -2019కు ఆమోదం తెలిపింది. ఇది చట్ట రూపం దాలిస్తే.. మహిళలపై అత్యాచారానికి పాల్పడే వారికి మరణ శిక్ష పడుతుంది. పక్కా ఆధారాలు ఉంటే.. అత్యాచార కేసుల దర్యాప్తును వారం రోజుల్లో పూర్తి చేయడంతోపాటు.. 14 రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేయనున్నారు. 21 రోజుల్లోనే శిక్షలు ఖరారవుతాయి. ఇప్పటి వరకూ ఇలాంటి కేసుల విచారణకు 4 నెలల సమయం పడుతుండగా.. ఇక నుంచి మూడు వారాల్లోనే తీర్పు వెలువడుతుంది. 

 

మహిళా భద్రత విషయంలో కఠిన చట్టం తీసుకొస్తామని చెప్పిన జగన్.. కేవలం రెండు రోజుల వ్యవధిలోనే తన మాటలను ఆచరణలో పెట్టారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణ కోసం జిల్లాకు ఓ కోర్టు చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఈ న్యాయస్థానాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లా పని చేస్తాయి. మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలను మాత్రమే ఈ కోర్టుల్లో విచారణ జరుగుతున్నాయి. 
 
మహిళలు, చిన్నారులను కించపరుస్తూ.. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటారు. మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్లు, రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధిస్తారు. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం గరిష్టంగా ఐదేళ్ల శిక్ష మాత్రమే పడుతుంది. కాగా.. నేరాల్లో తీవ్రతను బట్టి వారికి గరిష్టంగా జీవిత ఖైదు విధించేలా చట్టం తీసుకురాబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: