రాజకీయాల్లో వ్యూహాలు వేయడం అనేది గొప్పకళ. ఇది అందరికీ వచ్చేది కాదు. కొందరికి మాత్రమే అబ్బు తుంది. ఇప్పుడు ఇలాంటి వ్యూహాలు వేయడంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేయించుకుంటున్నారు జన సేనాని పవన్ కళ్యాణ్. ఆయన దూకుడు చాలా చిత్రంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయన రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షాన్ని మించిపోయిన పాత్రలో మునిగిపోయారు. మంచిదే.. ప్రజల తరఫున ఎవరో ఒకరు మాట్లాడాల్సిందే. ఈ విషయంలో పవన్ దూకుడుగా ఉండడాన్ని ఎవరూ కాదనరు.
అయితే, పవన్ తాను చేయాలని అనుకున్న ఏ నిరసననైనా.. ఏ ఆందోళననైనా సమయం చూసుకుని పక్కాగా స్కెచ్ సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో ఆయన వ్యూహం వేయడంలో చాలా దిట్ట అయిపోయారని అంటున్నారు పరిశీలకులు. గత నెలలో ఆయన టైం చూసుకుని విశాఖలో ఇసుక లాంగ్ మార్చ్ నిర్వహించారు. వాస్తవానికి అప్పటి వరకు ఆయన మౌనంగా ఉన్నారు. వరదలు వచ్చి, నదులు, వాగులు పొంగిన సమయంలో ఆయన చాలా మౌనం పాటించారు. వరదలు ఉధృతంగా వచ్చి, ఇసుక ఆగిపోయిన రెండు మాసాల వరకు పవన్ ఎక్కడున్నారో తెలియని పరిస్థితి.
ఇక, వరదలు తగ్గుముఖం పట్టి.. ప్రభుత్వం కూడా ఇసుక సరఫరాకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నాక, అనూహ్యంగా పవన్ అనే నాయకుడు తెరమీదికి వచ్చేశారు. జగన్పై కస్సు.. బుస్సు.. అంటూ ఏవేవో విమర్శలు చేశారు. ఆ వెంటనే వారంలో ఇసుక ఎలాగూ ప్రజల చెంతకు వచ్చేసింది. దీంతో ఇదిగో నేను చేసిన లాంగ్ మార్చ్ వల్లే.. ఇసుక వచ్చింది!! అంటూ .. తన ఖాతాను నింపేసుకున్నారు. ఇక, ఇప్పుడు గురువారం కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష పేరుతో పవన్ దీక్షకు రెడీ అయ్యారు.
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరరావడం లేదని, రైతులు నష్టపోతున్నారని, సో.. వారికి న్యాయం చేసే వరకు నేను విశ్రమించనంటూ.. ఒకరోజు దీక్షకు రెడీ అయ్యారు. చిత్రం ఏంటంటే.. మంగళవారం నాటికే జగన్ ప్రభుత్వం రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు రెడీ అయింది. దీనికి సంబంధించి ధరలను ప్రకటించింది. అదే గురువారం అన్ని పత్రికల్లోనూ కనీస మద్దతు ధరలను ప్రకటన రూపంలో ఇవ్వనుంది.
దీంతో రైతులకు మేలు జరిగి.. వారికి మార్కెటింగ్ సౌలభ్యం కలగనుంది. అయితే, పవన్ దీనిని కూడా తన ఖాతాలో వేసుకునే ప్రయత్నంలో బాగంగా టైం చూసుకుని .. దీక్షకు రెడీ అవుతున్నారనే వాదన వినిపిస్తోంది. మరి దీనికి ఆయన సమాధానం చెబుతారో చూడాలి. అయితే ప్రతిసారి పవన్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బాబు కంటే వేగంగా నిర్ణయాలు తీసుకోవడంతో పవన్పై ప్రజల్లో ఎంతో కొంత మైలేజ్ పెరుగుతోంది. పవన్ స్పందించాక బాబు స్పందిస్తుండడం కూడా టీడీపీకి మైనస్గా మారింది.