దిశపై అత్యాచారం చేసిన నిందితులను చట్టప్రకారం శిక్షించాలని, తమ బిడ్డలు చేసింది తప్పే అయినపుడు వదిలిపెట్టడం న్యాయం కాదు... చట్టం నలుగురికి ఎలాంటి తీర్పు ఇస్తే ఆ శిక్షను వేయాలని గతంలో నిందితుల కుటుంబసభ్యులు పేర్కొన్న సంగతి తెలిసిందే. అటు దిశ తండ్రి కూడా చట్టప్రకారం శిక్షించాలని కోరుకున్నారు. కానీ, అనుకున్నది ఒకటి.. అక్కడ జరిగింది మరొకటి.
ఎవరూ ఊహించనటువంటి సంఘటన జరిగింది. నిందితులను పోలీసులు డిసెంబర్ 6 వ తేదీ అర్ధరాత్రి సమయంలో సీన్ రికన్స్ట్రక్షన్ పేరుతో తీసుకెళ్లి ఎన్ కౌంటర్ చేయడం అందరికి షాక్ ను ఇచ్చింది. తమ పిల్లలకు శిక్ష పడుతుంది అనుకున్నాం కానీ, ఇలా ఎన్ కౌంటర్ చేస్తారని అనుకోలేదని అంటున్నారు. చట్ట ప్రకారం ఎలాంటి శిక్ష విధించిన సంతోషంగా ఉండేదని, ఇలా కాల్చి చంపడం న్యాయం కాదని నిందితుల తల్లిదండ్రులు పేర్కొన్నారు.
పోలీసులపై నిందితుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలని, ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని అంటున్నారు కుటుంబ సభ్యులు. కుటుంబ సభ్యులను నిన్నటి రోజున రాష్ట్ర మానవ హక్కుల సంఘం కలిసింది. వారి నుంచి వివరాలు సేకరించింది. ఇటీవలే జాతీయ మానవ హక్కుల సంఘం ఈ విషయంలో ఇప్పటికే ఓ రిపోర్ట్ తయారు చేసిన సంగతి తెలిసిందే.
ఇటు రాష్ట్ర మానవ హక్కుల సంఘం కూడా ఇలాంటి రిపోర్ట్ తయారు చేస్తున్నది. వివరాలు సేకరించే సమయంలో నిందితుల తల్లిదండ్రులు పోలీసులపై కోపంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పోలీసులను తమ గ్రామానికి తీసుకురావాలని, వాళ్ళను తాము చంపేస్తామని అంటున్నారు. చట్టప్రకారం శిక్షించకుండా ఇలా ఎన్ కౌంటర్ చేయడం ధర్మం కాదని వారు చెప్పడం విశేషం. దిశ కేసును పోలీసులు ఎన్ కౌంటర్ తో ముగించారని అనుకున్నారు. కానీ, ఈ కేసు పోలీసుల మెడకు చుట్టుకుంటుందని పాపం అస్సలు అనుకోలేదు.