ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా సుప్రసిద్ధుడు అయిన గొల్లపూడి మారుతీరావు నేడు కన్నుమూశారు. చెన్నై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గొల్లపూడి ఆత్మకి శాంతి కలగాలని, ఆయన మృతి టాలీవుడ్ పరిశ్రమకి తీరని లోటు అని సినీ ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు.250కి పైగా చిత్రాలలో నటించిన గొల్లపూడి తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవ ఎనలేనిది.
గొల్లపూడి..కేవలం సినీనటుడే కాదు...ఇన్ని ప్రత్యేకతలున్న వ్యక్తి కూడా
గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించిన గొల్లపూడి తన జీవితం గురించి ఓ సందర్భంలో ఆసక్తికరంగా వివరించారు. మారుతీరావు 80 జన్మదినం సందర్భంగా విశాఖలో విశాఖ రసజ్ఞ వేదిక ఆధ్వర్యంలో జరిగిన ‘గొల్లపూడి.. అశీతిపర్వం’కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా 80 ఏళ్లలో 67 సంవత్సరాలు రాస్తున్నానని, కొన్ని గొప్పగా రాశానని తెలిపారు. తన జీవితంలో కన్నీళ్లు లేవని, అయితే తన కుమారుడు శ్రీనివాస్ మరణం తనను కలచివేసిందని చెప్పారు.
కాగా, గొల్లపూడి మారుతీరావు కుమారుడు,గొల్లపూడి శ్రీనివాస్ ప్రేమ పుస్తకం అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నప్పుడు ప్రమాద వశాత్తు మరణించారు. ఆయన జ్ఞాపకార్థం మారుతీరావుగారు దేశంలోని వివిద భాషల్లో ఉత్తమ ప్రతిభను కనపరిచిన డెబ్యూ డైరెక్టర్లకు గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. దివంగత గొల్లపూడి శ్రీనివాస్ పేరుమీద గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ ఫౌండేషన్ ప్రతి ఏట ఆగష్టు 12 న ,ఉత్తమ ప్రతిభను కనపరిచిన డెబ్యూ డైరెక్టర్ కి గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డును అందిస్తోంది.
కాగా, 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో గొల్లపూడి జన్మించారు. 13 ఏళ్ల వయస్సులోనే ఆల్ ఇండియా రేడియోలో ఉద్యోగం సంపాదించారు. గొల్లపూడి .. డాక్టర్ చక్రవర్తి చిత్రానికి ఉత్తమ రచయితగా నంది పురస్కారం అందుకున్నారు. గొల్లపూడి నటించిన చివరి చిత్రం జోడీ. 14 ఏళ్ళకే ఆశా జీవీ మొదటి కథ రాసారు. కె విశ్వనాథ్ తొలి చిత్రం ఆత్మ గౌరవం చిత్రానికి రచయితగా గొల్లపూడి పని చేశారు.