గురువారం టీడీపీ సభ్యులు శాసనమండలిలో ఉల్లి ధరలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో హెరిటేజ్ పేరెత్తగానే సభ నుంచి నిష్క్రమించారు. దీనిపై సభలో ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. కేవలం రూ. 25కే ఉల్లిపాయలను రైతు బజార్ల ద్వారా సబ్సిడీ కింద పంపిణీ చేస్తున్నామని.. అంతేకాకుండా రేపటి నుంచి మార్కెట్ యార్డులో కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. కానీ రూ.150 ఉల్లి ధర హెరిటేజ్ మార్కెట్లో ఉందని చెబుతుండగా ఒక్కసారిగా తెలుగుదేశం సభ్యులు ఉలిక్కిపడ్డారు. ఇక సభలో ఎటువంటి సంబంధాలు తమ కుటుంబానికి హెరిటేజ్ సంస్థకు లేవని నారా లోకేష్ అనడంతో రభస నెలకొంది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు హెరిటేజ్ పేరెత్తగానే ఎందుకు పారిపోతారంటూ అక్కడ వున్న టీడీపీ సభ్యులను ఎద్దేవా చేశారు.
నిజానికి ప్రజలు ఉల్లిపాయలు మెడలో వేసుకుని పొర్లుదండాలు పెట్టినా తెలుగుదేశాన్ని నమ్మే స్థితిలో లేరని.. ఈ విధంగా టీడీపీ సభ్యులు పబ్లిసిటీ కోసం మెడలో వేసుకొచ్చిన ఉల్లిపాయలు కూడా ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చినవే అని హేళన చేశారు. ఇటీవల తెలుగుదేశం టీడీపీ నాయకులు పేదలకు చెందాల్సిన ఉల్లిపాయలను దుర్వినియోగం చేశారంటూ దుయ్యబట్టారు.
ఈ సందర్భంగా మంత్రి మోపిదేవి ఉల్లి సాగు గణనీయంగా దేశవ్యాప్తంగా తగ్గడంతో.. ధరలు పెరిగాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 101 రైతు బజార్ల ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా ఉల్లిపాయలను ఇరవై ఐదు రూపాయలకే పంపిణీ చేస్తోందని పేర్కొన్నారు. గతంలో ఉల్లి సాగు రాజధాని ప్రాంతంలో ఎక్కువగా ఉండేదని.. ఇప్పుడు తగ్గిపోయిందని అన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్కువ ధరకే ఉల్లిపాయలు అందిస్తున్నందుకు అభినందించిందని మంత్రి సభలో పేర్కొన్నారు.
ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రెడ్డి ఉల్లిపాయల కొరతపై నాలుగు సార్లు సమీక్ష నిర్వహించారని, ఎంత ఖర్చయినా సరే.. రూ.25కే ప్రజలకు ఉల్లి అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. ఇప్పటివరకు ప్రజలకు ఉల్లిని 42,096 క్వింటాళ్ల దిగుమతి చేసుకుని సబ్సిడీ కింద పంపిణీ చేశామని.. దీని కారణంగా ప్రభుత్వంపై రూ. 22 కోట్ల భారం పడిందని అన్నారు.