పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి స్థానిక అవసరాలకు తగ్గట్లు కంపెనీల ఏర్పాటుకు ప్రాముఖ్యత ఇస్తుందని  పేర్కొన్నారు.  గురువారం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి మన్నవరం ఎన్టీపీసీ- బీహెచ్ఇఎల్‌ పవర్‌ ప్రాజెక్టు లిమిటెడ్‌కు శంకుస్థాపన, ప్రాజెక్టుకు సంబంధించి తయారీ యూనిట్లను రద్దు చేసిన విషయంపై  అసెంబ్లీలో ప్రశ్నించారు.  తన వెంకటగిరి నియోజకవర్గానికి కేవలం 2 కి. మీ దూరంలోనే ఈ ప్రాజెక్టు ఉందని.. మన్నవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటని అడిగారు.

 

ఈ ప్రశ్నపై  మంత్రి సమాధానమిస్తూ.. తమకు కూడా వెంకటగిరితో  సంబంధాలున్నాయని తాము కూడా మెట్ట ప్రాంతాల వాసులమేనని అన్నారు. అంతేకాకుండా  మంత్రి మన్నవరం ప్రాజెక్టులో ఎన్‌టీపీసీ- బీహెచ్‌ఇయల్‌ ధర్మల్‌ ప్రాజెక్ట్స్‌ చేస్తారని, బీహెచ్‌ఇయల్‌ ధర్మల్‌ ప్రాజెక్టులకు అవసరమైన ఉత్పత్తులను తయారు చేస్తుందని ,ఎన్‌టీపీసీ విద్యుత్‌ ఉత్పత్తి చేసే సంస్థ అని వివరించారు. అయితే ఇప్పుడు అక్కడ ప్రత్యామ్నాయాలు కూడా చూస్తున్నామని తెలిపారు. 

 


మంత్రి మేకపాటి గౌతం రెడ్డి  శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చర్‌ క్లస్టర్స్‌ తీసుకువస్తున్నామని అన్నారు.  కంపెనీతో ఇప్పటికే వేరే చర్చలు జరుగుతున్నాయని అంతేకాదు అక్కడ ఈఎంసీ-3 ప్రారంభం కాబోతోందని  తెలిపారు. ఇప్పటికే ఈఎంసీ-1 అయిపోయిందని.. ఈఎంసీ-2 వచ్చిందని.. త్వరలో ఈఎంసీ-3 కూడా విస్తరించనున్నామని వెల్లడించారు. సాంప్రదాయ చేనేత, హస్తకళలు వంటి సానుకూలతలు  వెంకటగిరికి వచ్చేసరికి ఉన్నాయని వివరించారు.

 

ఇక అపెరెల్స్‌, గార్మెంట్స్‌ ఫ్యాక్టరీలు కూడా అక్కడ ఏర్పాటు చేయవచ్చన్నారు.  ఆ భూమిలో సోలార్‌ ప్లాంట్‌ యూనిట్‌ ఎన్టీపీసీ ఏర్పాటు చేయకపోతే.. ప్రత్యామ్నాయాలు చూస్తామని  తెలిపారు. అధునాతనమైన వ్యాపార అవకాశాల కల్పనకు ప్రభుత్వం ప్రాముఖ్యత ఇస్తుందన్నారు.  వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి తీసుకురావాలని ఎన్నోసార్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మన్నవరం ప్రాజెక్టుపైన కేంద్ర సహకారం కూడా తీసుకొంటామని మేకపాటి  గౌతంరెడ్డి సమాధానం ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: