గత తెలుగుదేశం హయాంలో చేసిన భూ అక్రమాలను వైసీపీ మంత్రులు తవ్వి తీస్తున్నారు. ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు. వందల ఎకరాలు మొదలుకుని.. ఒకటి రెండు ఎకరాల విషయాల్లోనూ అక్రమాలు జరిగాయంటున్నారు. కందుకూరులో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు ఒక పథకం ప్రకారం గత ప్రభుత్వం తెరతీసిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు.

 

అసెంబ్లీలో మహీధర్ రెడ్డి మాట్లాడుతూ.. 1960 నుంచి పశుసంవర్థక శాఖ ఆధీనంలో ఉన్న సుమారు రెండు ఎకరాల భూమి ఉందని, అప్పటి పురపాలక శాఖ కోరిక మేరకు 50 సెంట్ల భూమిని పబ్లిక్‌ హెల్త్‌ డిపార్టుమెంట్‌కు అందజేశారన్నారు. 2000 సంవత్సరంలో కొందరు కందుకూరు సబ్‌కోర్టులో పిటీషన్‌ వేస్తే న్యాయస్థానం ప్రభుత్వ భూమి అని నిర్ధారించి తీర్పు ఇచ్చిందన్నారు. దీనిపై 2008లో జిల్లా కోర్టుకు పిటీషనర్లు అప్పీల్‌కు వెళ్లారని, ఆ కోర్టు కూడా పిటీషన్‌ కొట్టేసిందన్నారు.

 

హైకోర్టుకు వెళ్లినా కోర్టు ధ్రువీకరించే లోపే పిటీషన్‌ ఉపసంహరించుకున్నారన్నారు. మళ్లీ తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత ఒక పద్ధతి ప్రకారం ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు పథకం రచించారన్నారు. ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌ వ్యక్తికి కట్టబెట్టేందుకు గత ప్రభుత్వం మున్సిపల్‌ కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్‌కు ఎందుకు ఆదేశాలు ఇప్పించిందో సమాధానం చెప్పాలని మహీధర్ రెడ్డి డిమాండ్ చేశారు.

 

అయితే ఇక్కడ వైసీపీ నేతలు ఒక విషయం గమనించాలి. వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తోంది. కాబట్టి ఇంకా గత టీడీపీ పాలనపై విమర్శలు తగ్గించేసి.. తామేం చేస్తారో చేసి చూపించాలి. టీడీపీ అక్రమాలు ఉంటే.. విచారణ జరిపించి రుజువు చేస్తే.. బావుంటుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: