రాష్ట్రం మొత్తంలో పర్యటిస్తూ... రైతుల సమస్యలను తెలుసుకుంటూ... ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జగన్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే రైతు సౌభాగ్య దీక్షకు పూనుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే కాకినాడ లో పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు సౌభాగ్య దీక్షకు జనసేన పార్టీకి ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే జనసేన సోలో ఎమ్మెల్యే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దీక్ష కు హాజరు కాకపోవడంతో ఆగ్రహించిన పార్టీ రాపాక కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఆంధ్ర రాజకీయాల్లో వార్తలు హల్ చల్ చేశాయి.
అయితే రాపాక వరప్రసాద్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వచ్చిన వార్తలపై స్పందించిన పార్టీ అధిష్టానం పార్టీ ఎమ్మెల్యే అయిన రాపాక వరప్రసాద్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని... తాము ఎలాంటి షోకాజ్ నోటీసులు జారీ చేయలేదని వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే... జనసేన పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేయలేదని వివరణ ఇవ్వడానికి ముందే జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్... తనకు పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు వస్తున్న వార్తలపై స్పందించిన సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తనకు ఎవరో షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఏంటని రాపాక ప్రశ్నించారు. తాను ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేను అని వారు ఓడిపోయిన వారు అని గుర్తుంచుకోవాలి అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
జనసేన పార్టీ పైన ఎవరికైనా అధికారం ఉంది అంటే అది తన ఒక్కడికేనని అంటూ స్పష్టం చేశారు రాపాక వరప్రసాద్. తాను ఎవరి దయాదాక్షిణ్యాలతో ఎన్నికల్లో గెలవలేదని... కేవలం తన శక్తితో గెలిచానని.. ప్రజలు తన మీద ఉన్న నమ్మకంతోనే తనను గెలిపించారని ఆయన అన్నారు. తనకు ఎవరి బిక్ష అవసరం లేదంటూ రాపాక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవడానికి కారణం వాళ్లే అయితే వాళ్లు రెండు చోట్ల ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు అంటూ ... పవన్ ఉద్దేశిస్తూ ప్రశ్నించారు రాపాక వరప్రసాద్. ఒక దిశానిర్దేశం లేని పార్టీలో ఉండడం తనకి ఇష్టం లేదని.. ఒకవేళ రాజీనామా చేసిన మళ్లీ ఎన్నికల్లో కూడా గెలిచే శక్తి తనకు ఉందంటూ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పేర్కొన్నారు. మరి ఆయనకు అంత శక్తి ఉందా అంటూ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించారు. షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నాము అంటూ మరోసారి ఇలాంటి ప్రకటనలు చేస్తే ఏం చేయాలో తనకు తెలుసు అంటూ రాపాక వరప్రసాద్ ఘాటుగా వ్యాఖ్యానించడం ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.