తెలంగాణలో ప్రస్తుతం కేవలం ఒక విమానాశ్రయం వాడుకలో ఉన్న సంగతి తెలిసిందే. అది శంషాబాద్‌లోని ఆర్‌జీఐఏ అంతర్జాతీయ విమానాశ్రయం కాగా బేగంపేట ఎయిర్‌పోర్టులో కమర్షియల్‌ విమానాలకు అనుమతి లేకపోవడంతో తెలంగాణ మొత్తానికి ఒకే ఒక విమానాశ్రయం ఉన్నట్లయింది. విదేశాల నుంచి వచ్చేవారు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లాలంటే.. శంషాబాద్ విమానాశ్రయంలో దిగి, ఆయా ప్రాంతాలకు రోడ్డు మార్గం గుండా వెళ్లాల్సిందే. లేదా వారికి దగ్గరలోని పక్క రాష్ట్రాలపై ఆధారపడాల్సిందే.    


అయితే, ఈ పరిస్థితిని గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రంలో వివిధ చోట్ల విమనాశ్రయాల అవసరాన్ని గుర్తించింది. ఇందుకోసం ఆరు విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ మేరకు వాటి ఏర్పాటుకు ఉండాల్సిన అర్హతలు, ఇతర సాధ్యాసాధ్యాలపై కసరత్తు జరుగుతోంది. ప్రయాణికుల సౌలభ్యం, రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తెలంగాణలో ఆరు ప్రాంతాలను గుర్తించారు. అవి.. నిజామాబాద్‌, మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ జిల్లాల్లోనూ నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని అద్దకల్‌, భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం, వరంగల్‌ జిల్లా మామునూరు, ఆదిలాబాద్‌ నగర శివారు, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌ ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు అనువుగా ఉంటుందని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా భూసేకరణ కూడా చేశారు. 

 

ఈ క్రమంలో తాజాగా మరో ముందడుగు పడింది. ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతిపాదించిన 6 విమానాశ్రయాలపై విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఏరియల్ సర్వే నిర్వహించాలని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) నిర్ణయించింది. ఈ సర్వే త్వరలో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన సాంకేతిక బృందాల ద్వారా ఈ సర్వేను ఏరియల్ సర్వేలో భాగంగా ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాంతాలను పూర్తిగా పర్యటించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారు. రిమోట్‌ సెన్సింగ్‌ జీఐఎస్‌ మ్యాపింగ్‌, నియంత్రణ వంటి సమాచారాన్ని సేకరిస్తారు. నేల స్వభావాన్ని కూడా అంచనా వేస్తారు. రన్‌వేలు, ఏటీసీకి అనుకూలతలు, ప్రతిపాదిత విమానాశ్రయ స్థలానికి చుట్టుపక్కల భౌగోళిక పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. 

 

వీటికి సంబంధించిన సమగ్ర వివరాలు గతంలోనే కేంద్ర పౌర విమానయాన శాఖకు పంపారు. రైట్‌ అనే సంస్థ ద్వారా సర్వే జరిపి నివేదికలను ప్రభుత్వం అందించగా, ప్రతిపాదనలను ఏఏఐకి పంపారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయాల అనుమతుల కోసం ఇప్పుడు జాతీయ విమానాశ్రయాల సంస్థ ఏరియల్ సర్వేను నిర్వహించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: