ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు కొంత సమయం పాటు రాపాక మీడియాతో ముచ్చటించారు. గతంలో రాపాక వరప్రసాద్ అసెంబ్లీ సమావేశాల కారణంగా పవన్ సభకు హాజరు కావటం లేదని చెప్పారు.
కానీ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఇతర కారణాల వలనే పవన్ సభకు హాజరు కాలేదని స్పష్టత ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రమం చేసినా పది మంది మాత్రమే వస్తారని రాపాక వరప్రసాద్ అన్నారు. చిన్న చిన్న విషయాలకు ధర్నాలు, సభలు పెట్టడం సరికాదని రాపాక అన్నారు. పవన్ కళ్యాణ్ సభలకు ఇకముందు ఆదరణ తగ్గిపోతుందని రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలు చేశారు.
గత కొన్ని రోజులుగా జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక పవన్ కళ్యాణ్ కు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో కోరని కోరికలు తీర్చే దేవుడని జగన్ ను ప్రశంసించిన రాపాక ఇంగ్లీష్ మీడియం గురించి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా స్వాగతించారు. రాపాక జగన్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ ఉండటంతో రాపాక పార్టీ మారతారనే ప్రచారం కూడా జరుగుతోంది.
మరోవైపు రాపాకకు జనసేన పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసిందనే వార్తల్లో కూడా నిజం లేదని తెలుస్తోంది. జనసేన పార్టీ రాపాక వరప్రసాద్ కు ఎటువంటి నోటీసులు జారీ చేయలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు అన్నీ రూమర్లేనని ఆ వార్తలను నమ్మాల్సిన అవసరం లేదని జనసేన పార్టీ వెల్లడించింది. తాజాగా రాపాక చేసిన వ్యాఖ్యల గురించి జనసేన పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.