ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాకు సంబంధించి వందశాతం వాటా విక్రయించాలని నిర్ణయించింది. విమానయాన రంగాన్ని అభివృద్ధి చేసేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి లోక్సభలో ప్రకటించారు.
ఎయిరిండియా.. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ. ఇది 94 జాతీయ, అంతర్జాతీయ సర్వీసులు నడుపుతోంది. ఈ విమానయాన సంస్థ .. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సర్వీసులు నిర్వహిస్తోంది. ఎయిరిండియాకు అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉంది. దేశంలోని పౌర విమానయానంలో 18.6 శాతం కలిగి ఉంది. నాలుగు ఖండాల్లో 60 అంతర్జాతీయ గమ్యాలకు ప్రయాణీకులను చేరవేస్తోంది.
1932లో జెఆర్డీ టాటా.. ఈ ఎయిర్ లైన్స్ ను ప్రారంబించారు. కరాచీ నుంచి ముంబై వరకూ తర్వాత మద్రాస్కు పొడిగించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. అయితే క్రమంగా నష్టాలు పెరుగుతూ రావడంతో.. ఇండియన్ ఎయిర్ లైన్స్లో విలీనం చేశారు. అయినప్పటికీ ఎయిరిండియా నష్టాల నుంచి బయటకు రాలేదు. ఫలితంగా దీనిని ప్రైవేటుకు అప్పగించాలని ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఎయిర్ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియాకు సంబంధించి 100శాతం వాటా విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని కేంద్ర పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురి లోక్సభలో తెలిపారు.
విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మంత్రి స్పష్టం చేశారు. రాబోయే ఐదేళ్లలో విమానయాన రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా25వేల కోట్ల రూపాయలు కోరినట్లు తెలిపారు. 2018-19 సంవత్సరానికి ఎయిర్ ఇండియా 8 వేల,556కోట్లు నష్ట పోయిందన్నారు. 50 వేల కోట్ల రూపాయల అప్పులతో సతమతమవుతున్న ఎయిరిండియాకు.. అప్పులే పెను సమస్యగా మారాయని నిపుణులు చెబుతున్నారు.