హైదరాబాద్ షాద్నగర్లో వైద్యురాలు దిశ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.దిశా ఘటనతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.కాగా ఎట్టకేలకు దిశ కేసులో నలుగురు నిందితులను ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. ఇదిలా ఉండగా తాజాగా ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల భద్రత గురించి ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దిశా ఘటన పరిగణలోకి తీసుకొని దిశ పేరుతో మహిళల రక్షణ కోసం సరికొత్త చట్టాన్ని ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది జగన్ సర్కార్. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపై వేగంగా చర్యలు తీసుకునేలా దిశ యాక్ట్ తీసుకురాబోతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .కాగా దిశ బిల్లు ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందింది. దిశా యాక్ట్ కి టిడిపి ఎమ్మెల్యేలందరూ ఆమోదం తెలిపారు.
అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ యాక్ట్ పై స్పందించిన టీడీపీ అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పలు వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రతపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయడం శుభపరిణామం అంటూ చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ చట్టాన్ని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అయితే దిశ బిల్లు తమకు ఈరోజు ఇచ్చారని... ఈ బిల్లును తాము పరిశీలించాల్సి ఉందని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలోని మహిళల భద్రత కోసం జగన్ ప్రభుత్వం బిల్లును తీసుకు వచ్చినట్లు గానే.. ఆ చట్టాన్ని అమలు చేయడంలో కూడా ఉత్సాహం చూపాలని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
చట్టాలను చుట్టాలుగా భావిస్తే సమస్యలు ఎక్కువ అవుతాయని.. చట్టాలను చట్టాలలాగే చూస్తే ఏ సమస్య రాదని చంద్రబాబునాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. చట్టాలను చేసి వదిలేయకుండా వాటిని అమలు చేయడంలో కూడా ముందుండాలని చంద్రబాబు నాయుడు వైసీపీ సర్కార్ కు హితవు పలికారు. కేంద్రంలో ఈ తరహా చట్టాలు అన్నింటిని క్షున్నంగా పరిశీలించి... కేంద్ర ప్రభుత్వానికి కూడా సంప్రదించి... దిశ చట్టంను లోపరహితంగా మార్చాలి అంటూ చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. మహిళలపై అఘాయిత్యానికి పాల్పడిన దోషులు ఎంత గొప్పవాళ్లయినా... శిక్షలు ఉండేలా చట్టంలో ప్రతిపాదనలు ఉండాలని చంద్రబాబునాయుడు తెలిపారు. జగన్ సర్కారు ప్రవేశపెట్టిన దిశ యాక్ట్ బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలుపడం శుభ పరిణామమే .