వైఎస్ జగన్ ఈపేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతున్నది. జగన్ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయినప్పటికీ జగన్ అసెంబ్లీ సమావేశాల్లో సభలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఆకాశానికి ఎత్తారు. కెసిఆర్ తీసుకున్న నిర్ణయంతో దిశ కేసు నిందితులకు శిక్ష పడిందని, నిందితులను ఎన్ కౌంటర్ చేయడం సబబే అని చెప్పడంతో జగన్ మద్దతు లభించింది కెసిఆర్ కి.
అలానే తెలంగాణ పోలీసులకు కూడా నైతికంగా బలం చేకూరింది. అత్యాచారాలు అన్నవి ఒక్క తెలంగాణాలోనే కాదు దేశం మొత్తం జరుగుతూనే ఉన్నాయి. దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ తరువాత కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఈ విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం అందరికంటే ఓ అడుగు ముందే ఉన్నది. జగన్ ఈ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ఒకటి దిశ యాక్ట్ తీసుకురావడం. చట్టాల్లో మార్పులు చేసి దిశ యాక్ట్ ను తీసుకొచ్చారు. ఈ యాక్ట్ ప్రకారం ఎవరైనా అత్యాచారానికి పాల్పడితే.. 21 రోజుల్లోకి కేసును కోర్టు పూర్తి చేయాలి. ఆ తరువాత నిందితుడికి శిక్ష వేయాలి.
నిందితుడు చేసింది తప్పే అని తేలితే... మరణశిక్ష పడుతుంది. అత్యాచారం, హత్యలకు మరణశిక్ష ఒక్కటే పరిష్కారం అని జగన్ సర్కార్ నమ్ముతోంది. ఇక మహిళలను వేధించినా, సోషల్ మీడియాలో వారి గురించి అసభ్యంగా పోస్టింగ్ లు పెట్టినా వారిపై కూడా చర్యలు తీసుకుంటారు. జైలు శిక్ష విధిస్తారు. ఫోక్సో చట్టం ప్రకారం అరెస్ట్ చేస్తే కనీసం ఐదేళ్లపాటు శిక్ష పడుతుంది. ఇలా చట్టాల్లో సమూలంగా మార్పు చేసింది. ఈ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.