గత కొంతకాలంగా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై జరుగుతున్న చర్చోపచర్చలకు, సందేహాల పరంపరకు ఆయన చెక్ పెట్టారు. సీఆర్డీఏపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ సీఆర్డీఏ పరిధిలోని ప్రభుత్వ భవనాల నిర్మాణ విషయంలో ఓకే చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ఏపీ సర్కార్ స్పష్టతనిచ్చింది. ఇవాళ అసెంబ్లీలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాజధానిని అమరావతి నుంచి తరలించబోమని స్పష్టం చేసింది. అమరావతిని మారుస్తున్నారా ? అని మండలిలో టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యానారాయణ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో కీలకమైన క్లారిటీ ఇచ్చారు. గత ప్రభుత్వం వలే అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా రాజధాని పరిధిలో పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతోపాటుగా, రాజధాని అమరావతిలో నిలిచిపోయిన నిర్మాణాలు, ప్రధాన మౌలిక వసతుల పనుల్ని కొనసాగించేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే చేపట్టిన రాజధానిలో ప్రధాన రహదారుల నిర్మాణం, భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన (ఎల్పీఎస్) లేఅవుట్లలో మౌలిక వసతుల అభివృద్ధి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అఖిలభారత సర్వీసు అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు గృహనిర్మాణాల వంటి పనులన్నింటినీ కొనసాగించాలని...పూర్తి కావొస్తున్న నిర్మాణాలపై ముందు దృష్టిపెట్టాలని.. ఇందుకు నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం వైఎస్ స్పష్టం చేశారు.
కాగా, తాజాగా రాజధానిని మార్చడం లేదని ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. మండలిలో చర్చ జరుగుతోన్న సమయంలో రాజధానిపై ప్రశ్నలు తెలుగుదేశం సభ్యులు లేవనెత్తారు.అమరావతి నుంచి రాష్ట్ర రాజధానిని తరలించే ప్రతిపాదన ఉందా? ఒకవేళ ఉన్నట్లు అయితే ఇప్పటివరకు అమరావతి అభివృద్ధి కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలు ఏంటి? అని లిఖితపూర్వకంగా టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. దీనిపై లిఖితపూర్వకమైన సమాధానం ఇచ్చిన...రాజధానిలో అమరావతిలోనే కొనసాగుతోందని... ఎటూ తరలించడంలేదని స్పష్టం చేశారు. దీంతో అమరావతిలోనే రాజధాని ఉంటుందనేదానిపై క్లారిటీ వచ్చేసింది.