ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై జగన్ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. రాజధాని అమరావతిలోనే ఉంటుందని శుక్రవారం శాసనమండలిలో టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి బొత్స సత్యనారాయణ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. రాజధానిని అమరావతి నుండి  తరలించడం లేదని ఆయన తెలిపారు. మంత్రి బొత్స ప్రకటనతో రాజధాని విషయంలో గత ఆరు నెలలుగా నెలకొన్న సందిగ్దత తొలగినట్లయ్యింది. 


గతంలో రాజధానిపై బొత్స చేసిన ప్రకటనలతో రాజధాని రైతుల్లో సందిగ్ధం నెలకొంది. అమరావతి ఒకే సామాజికవర్గానికి మేలు చేసేలా ఉందని బొత్స వ్యాఖ్యానించారు. అన్ని జిల్లాలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యం అన్నారు. రాజధాని సహా జిల్లాల అభివృద్ధి కోసం నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక ఇచ్చాకే రాజధాని భవితవ్యం తేలుతుందన్నారు. కమిటీ ఎక్కడంటే అక్కడే రాజధానిని ఏర్పాటు చేస్తామన్నారు.


సీఆర్డీఏ పరిధిలోని అసైన్డ్ భూముల విషయంలో జగన్ సర్కారు ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. థర్డ్ పార్టీ కొనుగోళ్లను రద్దు చేసిన ప్రభుత్వం.. అసలు యజమానులకే ల్యాండ్ ఫూలింగ్ ద్వారా లబ్ది చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్ విభజన తర్వాత ఇండియా మ్యాప్‌ను విడుదల చేసిన కేంద్రం.. ఏపీ రాజధానిని అందులో పేర్కొనలేదు. దీంతో టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఆంధ్ర రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ.. అమరావతితో కూడిన కొత్త మ్యాప్‌ను కేంద్రం విడుదల చేసింది. కానీ అమరావతిపై కేంద్రం ప్రకటన తర్వాత జగన్ సర్కారు వైఖరి మారిందనే భావన వ్యక్తం అవుతోంది. ఆ తర్వాత అమరావతి నిర్మాణాల్లో వేగం పెంచాలని జగన్ సర్కారు అధికారులను ఆదేశించింది. 


రాజధానిని తరలించడం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసినా.. నూతన నిర్మాణాల విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రభుత్వ తీరును చూస్తుంటే.. రాజధాని నిర్మాణం విషయంలో గత ప్రభుత్వ వైఖరికి భిన్నంగా వ్యవహరించే అవకాశం ఉంది. వాస్తవికతకు దగ్గర.. హంగు ఆర్భాటాలకు దూరంగా రాజధాని నిర్మాణం ఉండాలనేది జగన్ సర్కార్ భావనగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: