ఆదివాసి జిల్లా అయిన కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలంలోని ఎల్లాపటార్లో సమతపై లైంగికదాడి చేసి, హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బతుకుదెరువు కోసం మండలానికి వచ్చిన ఓ వివాహితను గుర్తుతెలియని దుండగులు పట్టపగలు అత్యాచారం చేసి... ఆపై హత్య చేసిన ఘటన మండలంలోని ఏల్లాపటార్ రామునాయక్తండా వద్ద ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తలిద్దరూ వెంట్రుకలకు బుగ్గలు అమ్ముకుంటూ పిల్లలను పోషించుకుంటుండగా ఆ ఆడబిడ్డ దుర్మార్గుల చేతిలో కన్నుమూసింది.
గత నెల 25వ తేదీన ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఒంటరిగా వస్తున్న సమతను మార్గమధ్యంలో నిందితులు షేక్ బాబు, షేక్ షాబొద్దీన్, షేక్ మఖ్ధూమ్ బలవంతంగా చెట్లపొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి చేసిన అనంతరం గొంతుకోసి హత్యచేసినట్లు నేరం ఒప్పుకున్నారని ఎస్పీ మల్లారెడ్డి చెప్పారు. ముగ్గురు నేరస్థులను అదుపులోకి తీసుకొని డీఎస్సీ ఆసిఫాబాద్ కు అప్పగించినట్లు తెలిపారు. నిందితుల వాంగ్మూలం సేకరించి వారు హత్య చేయడానికి ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నామని, పరిశోధనలో భాగంగా కొన్ని శాస్త్రీయ ఆధారాలు సేకరించి కేసును పకడ్బందిగా దర్యాప్తు చేశామని వెల్లడించారు. చట్టప్రకారం వారికి తగు శిక్ష పడుతుందని పేర్కొన్నారు.
కాగా, ఈ కేసులో నిందితులపై పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ఇప్పటికే ఫాస్ట్ట్రాక్ కోర్టుకు ఫోరెన్సిక్ రిపోర్టు అందించినట్లు తెలుస్తోంది. ఈ వివరాల ఆధారంగా చార్జ్షీట్ను దాఖలు చేయనున్నారు. పకడ్బందీ ఆధారాలు ఉన్న నేపథ్యంలో ముగ్గురు నిందితులకు కఠిన శిక్షలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, ఆసిఫాబాద్లో మానవ మృగాల చేతిలో అత్యాచారం, హత్యకు గురైన సమత ఆత్మ శాంతించాలంటే ఆ ముగ్గురు నిందితులకు ఉరి శిక్ష పడాలని, లేదంటే ఎన్కౌంటర్ చేయాలని ప్రభుత్వాన్ని సమత భర్త కోరారు. తన భార్యను ముగ్గురు తాగుబోతులు దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశారని కంటతడి పెట్టుకున్నారు. మద్యాన్ని నిషేధించాలన్నారు.