పార్లమెంటు లో ఆమోదించిన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకం గా కొనసాగుతున్న నిరసనల దృష్ట్యా ఫ్రాన్స్, ఇజ్రాయెల్, యు.ఎస్ మరియు యు.కె భారతదేశానికి ప్రయాణించే తమ దేశ పౌరులకు ప్రయాణ సలహాలు జారీ చేశాయి. అత్యవసర పరిస్థితులు లేక పోతే ఇండియా కు ప్రయాణం రద్దు చేసుకోమని ఈ దేశాలు తమ పౌరులకు సూచిస్తున్నాయి.
విదేశీ మరియు కామన్వెల్త్ కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో, యునైటెడ్ కింగ్డమ్ భారతదేశం ఈశాన్య రాష్ట్రాల సందర్శకులకు కొన్ని సూచనలను విడుదల చేసింది. ఈ రాష్ట్ర ప్రయాణాలకు దూరంగా ఉండాలని, అత్యవసర పరిస్థితులలో మాత్రమే ఈ రాష్ట్రాలకు ప్రయాణం చేయాలనీ సూచించింది. ఈ రాష్ట్ర లలో ఉన్న పరిస్థితుల గురించి తాజా సమాచారం కోసం స్థానిక మీడియాను పర్యవేక్షించాలని కోరింది. వాగా బార్డర్ మినహా పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న జమ్మూ కాశ్మీర్, లడఖ్ మరియు అన్ని ప్రాంతాలకు అన్ని ప్రయాణాలను నివారించాలని యు.కె తమ దేశ పౌరులను కోరింది.
పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్) ఆమోదానికి వ్యతిరేకంగా అస్సాం లో చెలరేగుతున్న నిరసనలు మరియు హింసల నేపథ్యంలో యుఎస్ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా తమ దేశ పౌరులకు అధికారికంగా అస్సాం రాష్ట్రానికి అన్ని ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేసింది.
ఈశాన్య రాష్ట్రాలలో జరుగుతున్నా అల్లర్లు, హింసాత్మక సంఘటనల కారణంగా ఫ్రెంచ్ మరియు ఇజ్రాయెల్ ప్రభుత్వాలు కూడా తమ పౌరులను భారతదేశంలో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించాయి.
యు.ఎన్. మానవ హక్కుల సంఘం యొక్క హై కమిషనర్ కార్యాలయం ప్రకారం పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్) సమాజం లో వున్నా ఒక వర్గం పట్ల వివక్షత చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసిన తరువాత ఈ సలహాలు జారీ చేయబడ్డాయి. ఈ వ్యాఖ్యలు ఈశాన్య పరిస్థితుల గురించి ఆందోళనను మరింత పెంచాయి. ఈ పరిస్థితులే, డిసెంబర్ 15 నుండి 17 వరకు గువహతిలో జరగబోయే భారత-జపాన్ శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేయమని ప్రేరేపించాయి.