ఏపి రాజకీయాల్లో సమూలమైన మార్పులు చాలా జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయం సాధించిన తరువాత వరసగా అనేక పధకాలు రూపొందిస్తు వస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ పింఛన్ పధకం పై సంతకం చేసారు. ఆ తరువాత వరసగా పధకాలు ప్రవేశపెడుతూ వస్తున్న జగన్, తాజగా దిశ యాక్ట్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
దిశ యాక్ట్ ప్రకారం రాష్ట్రంలో మహిళలపై అత్యాచారం జరిగితే తీసుకునే చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. మైనర్ బాలికలపై అత్యాచారం చేస్తే మరణశిక్ష పడుతుంది. అలానే మహిళలను ఏడిపించినా, వారితో అసభ్యకరంగా ప్రవర్తించినా దానికి తగిన శిక్ష పడుతుంది. అంతేకాదు, కోర్టులో కేసును కేవలం 21 రోజుల్లోనే పూర్తి చేసి శిక్ష పడేలా చేసేందుకు అన్ని రకాలుగా చట్టాన్ని మార్పులు చేసింది.
దిశ యాక్ట్ 2019 చట్టాన్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. ప్రభుత్వం ఆమోదం తెలపడంతో దీనికి సంబంధించిన ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయబోతున్నది. అలానే ఏ కేసుల్లో విచారణను త్వరతగతిన పూర్తి చేయడానికి ప్రత్యేకమైన పోలీసు వ్యవస్థను కూడా తీసుకొస్తోంది. ప్రతి జిల్లాకు ప్రత్యేకమైన కోర్టును ఏర్పాటు చేసి కోర్టుకు వచ్చిన 21 రోజుల్లోనే విచారణ పూర్తి చేసి శిక్ష విధించాలి.
21 రోజులకు మించి విచారణ ఎక్కువ జరగకూడదు. సంఘటన జరిగిన వారం రోజుల్లోనే పోలీసుల విచారణ పూర్తికావాలి, దానికి సంబంధించిన చార్జీ షీటు కోర్టులో దాఖలు చేయాలి. ఇక ఈ దిశ యాక్ట్ బిల్లు తీసుకురావడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అభిమందించాడు. ఇప్పటి వరకు అత్యాచారం కేసులకు సంబంధించి నెలల తరబడి కేసులు నడుస్తుండేవి. ఇకపై అలాంటి ఇబ్బందులు ఉండబోవు.