భారత్ బచావో ఆందోళనలో రాహుల్ గాంధీ బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శలు. నా పేరు రాహుల్ గాంధీ.. రాహుల్ సావర్కర్ కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపిన్ ఇండియా వ్యాఖ్యలకు సారీ చెప్పే ప్రసక్తే లేదన్నారు. అయితే రాహుల్ వంద జన్మలెత్తినా సావర్కర్ కాలేరని కాషాయ పార్టీ సెటైర్లు వేసింది.
తాను సావర్కర్ను కాదు.... రాహుల్ గాంధీనంటూ మోడీ సర్కార్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్గాంధీ. కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ.. ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఏర్పాటు చేసిన భారత్ బచావో ఆందోళన సభలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల చివరి రోజు తనను క్షమాపణ చెప్పాలని అధికరపక్షం డిమాండ్ చేసిందని.. కానీ అలా క్షమాపణ చెప్పడానికి తాను సావర్కర్ను కాదన్నారు.
పేదల నుంచి వసూలు చేసిన లక్షల కోట్లను కేవలం అదానీ, అనీల్ అంబానీలకు మోడీ దోచిపెడుతున్నారని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఆర్థిక నిపుణులైన మాజీ ప్రధాని మన్మోహన్, మాజీ ఆర్థికమంత్రి చిదంబరం చెప్పినా... వినకుండా జి.ఎస్.టిని తీసుకొచ్చి దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ కుప్పకూల్చారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ గట్టి కౌంటర్ ఇచ్చింది. వంద జన్మలెత్తినా సరే... రాహుల్ గాంధీ ఎన్నడూ సావర్కర్ కాలేరని మండిపడింది. వీర్ సావర్కర్ వీరుడనీ, ఆయనలో దేశభక్తి, త్యాగం ఉందని గుర్తుచేసింది. రాహుల్ గాంధీలో దానికి పూర్తి విరుద్ధమైన లక్షణాలున్నాయన్నారు. దేశభక్తి లక్షణాలు, త్యాగ లక్షణాలు మెండుగా ఉన్నాయని అన్నారు. కానీ రాహుల్ గాంధీలో ఉన్న లక్షణాలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. రాహుల్ సారీ చెప్పేది లేదని తేల్చేసిన తరుణంలో.. బీజేపీ నెక్స్ట్ గేమ్ ప్లాన్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది.మొత్తానికి రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతోంది. ఆయనపై విమర్శలు సంధిస్తోంది. ఈ ఆరోపణలు ఇప్పట్లో ఆగేలాలేవు.