తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన ప్రాంతాలలో ఉత్తరాంధ్ర కూడా ఒకటి అనే సంగతి అందరికి తెలిసిందే. అక్కడ ఆ పార్టీకి ముందు నుంచి అండగా ఉన్న సామాజిక వర్గాలు అధికంగా ఉండటం, అశోక గజపతి రాజు, ఎర్రన్నాయుడు వంటి బలమైన నేతలు ఆ ప్రాంతం నుంచి పార్టీకి ప్రాధాన్యత వహించడంతో ఆ పార్టీకి తిరుగులేకుండా పోయింది అనేది అందరికి తెలిసిందే. రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం నేతలు చుక్కలు చూపించిన సందర్భాలు ఉన్నాయి.
ఇప్పుడు జగన్ దెబ్బకు వాళ్ళు కూడా, వెనక్కి తగ్గిపోయారు. ఎర్రన్నాయుడు మరణించిన తర్వాత ఆయన కుమారుడు ఆ స్థానంలోకి వచ్చారు. సోదరుడు అచ్చేన్నాయుడు కూడా ఆయన లేని లోటుని భర్తీ చేసే ప్రయత్నాలు చేసారు. అంత వరకు బాగానే ఉన్నా ఇప్పుడు ఆ పార్టీ ఉత్తరాంధ్రలో ఇబ్బందులు పడుతుంది... శ్రీకాకుళం జిల్లాను పక్కన పెట్టి విజయనగరం, విశాఖ జిల్లాలను చూస్తే... ఆ పార్టీకి అక్కడ భవిష్యత్తు లేదనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి.
అశోక గజపతి రాజు ఓటమి పాలు కావడంతో విజయనగరంలో క్యాడర్ ఇబ్బంది పడుతుంది. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నా సరే.. జిల్లాలో పార్టీ బాధ్యతలను స్వయంగా చూసుకునే వారు... అయితే ఇప్పుడు మాత్రం... ఆయన కొన్ని కారణాలతో హైదరాబాద్ కే పరిమితం అయిపోయారు. దీనితో క్యాడర్ ని నడిపించే నేత కనపడటం లేదు. అశోక్ కుమార్తె అతిథి గజపతి ఉన్నా ఆమె విజయనగరం నియోజకవర్గానికే పరిమితమైపోయారు.
ఇకపోతే విశాఖ జిల్లాలో పార్టీకి సమర్ధవంతమైన నేత లేరు... గంటా శ్రీనివాసరావు ఉన్నా... ఆయన ఎప్పుడు పార్టీని వదిలేస్తారో తెలియని పరిస్థితి. నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నా సరే వాళ్ళల్లో జిల్లా స్థాయి నేతలు ఎవరూ లేరు. వెలగపూడి రామకృష్ణబాబు దూకుడుగా ఉన్న ఆయన నియోజకవర్గానికే పరిమతమవుతున్నారు. దీనితో ఆ పార్టీ ఈ రెండు జిల్లాల్లో దాదాపుగా కనుమరుగు అయ్యే పరిస్థితిలో ఉందని అంటున్నారు పరిశీలకులు.