తెలుగుదేశం పార్టీలో లోకేష్ నాయకత్వాన్ని ఆ పార్టీ కార్యకర్తలు ఎంత వరకు కోరుకుంటున్నారు అనేది పక్కన పెడితే... ఆ పార్టీకి నాయకత్వం జూనియర్ ఎన్టీఆర్ వహించాలి అనుకునే వారు మాత్రం ఆ పార్టీలో ఎక్కువగానే ఉంటారు. ఆయన్ను చంద్రబాబు పార్టీలోకి బ్రతిమిలాడి అయినా సరే తీసుకొస్తే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది అనే వ్యాఖ్యలు సొంత పార్టీ కార్యకర్తలే చేస్తూ ఉంటారు. లోకేష్ కి అంత సామర్ధ్యం లేదని ఆయన్ను పక్కన పెట్టి జూనియర్ ఎన్టీఆర్ కు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది అంటూ వాళ్ళు వ్యాఖ్యానిస్తూ ఉంటారు.
అయితే జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది మాత్రం ఇప్పటి వరకు తెలియదు. ఆయన అసలు పార్టీ బాధ్యతలను తీసుకుంటారా ? లేదా అనేది మాత్రం ఏ స్పష్టతా లేదు. దీనిపై ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు వినపడుతున్నాయి. తన వద్దకు వెళ్ళిన కొందరు పార్టీ సన్నిహితుల వద్ద జూనియర్ కీలక వ్యాఖ్యలు చేశారట. తనకు రాజకీయాల మీద అవగాహన లేదని, తనకు అక్కడికి వెళ్ళినా పెద్ద ప్రాధాన్యత ఉండదని... కార్యకర్తలు నన్ను కోరుకోవడం వేరు, అధిష్టానం నన్ను కోరుకోవడం వేరు అంటూ చెప్పేశాడట.
అలాగే కొంత మందికి పార్టీలో నా మనుగడ ఇష్టం లేదని, అందుకే అక్కకు కూడా ప్రచారం చేయలేదని, నాన్నతోనే అన్నీ అయిపోయాయని మళ్ళీ జెండా పట్టుకోలేను అని చెప్పారట తారక్. ఇప్పుడు ఈ విషయం పార్టీ వర్గాల్లో కూడా ఎక్కువగానే చర్చ జరుగుతుంది. అసలే కష్టాల్లో ఉన్న పార్టీకి ఆయన అవసరం ఉన్న సమయంలో ఇలా మాట్లాడటం ఏంటీ అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
పార్టీలో ఓడిపోయిన ఏడెనిమిది మంది కమ్మ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు జూనియర్ను తీసుకు రావాలని చెపుతున్నా చంద్రబాబుకు చెవికి మాత్రం ఎక్కడం లేదట. కొందరు మాత్రం ఎన్టీఆర్తోనే పార్టీకి భవిష్యత్తు ఉందని దయచేసి అన్ని మర్చిపోయి వస్తే మంచిది అంటూ వ్యాఖ్యానిస్తున్నారట. దీనితో ఆయన వచ్చే అవకాశం లేదని స్పష్టంగా అర్ధమైంది.