చాలాకాలం తర్వాత రీ ఎంట్రీ ఓవైపు సినిమాలు...మరోవైపు రాజకీయాలను విజయవంతంగా ఏకకాలంలో కొనసాగిస్తున్న ప్రముఖ నటి - తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి తాజాగా ఆసక్తికర కామెంట్లతో సెన్షేషనల్ గా మారారు. కేసీఆర్ ఏడాది పాలనపై రాములమ్మ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. టీఆర్ ఎస్ కు పోటీగా ఎన్నికల్లో ఖర్చు పెట్టే విషయంలో  జాతీయ పార్టీలైన కాంగ్రెస్ - బీజేపీ సైతం తట్టుకోలేకపోతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది  పూర్తవుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ పాలన గురించి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆర్థికంగా చాలా బలిమితో ఉందని - ముఖ్యమంత్రి గారు - ఆయన కుటుంబం అంతకన్నా ఎక్కువ  కలిమితో  ఉన్నారని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అంటూ ఎద్దేవా చేశారు.

 

మిగులు బడ్జెట్ తో మొదలైన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయి... ప్రభుత్వ ఉద్యోగులు - అధికారులు ఖర్చులు తగ్గించుకుని పొదుపుగా డబ్బుల్ని వాడాలని సీఎం కేసీఆర్ గారు సూచించే స్థాయికి దిగజార్చిన ఘనత టిఆర్ ఎస్ ప్రభుత్వానిదని వియశాంతి వ్యంగ్యంగా విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులు - అధికారులు ఖర్చులను తగ్గించుకోవాలని సూచనలిస్తున్న కేసీఆర్ సీఎంగా తాను చేస్తున్న దుబారా ఖర్చులను ఎంతవరకు తగ్గించారో వివరించాల్సిన అవసరం ఉందని కామెంట్ చేశారు. ప్రజల సెంటిమెంట్లతో కూడిన అంశాలను తనకు అనుకూలంగా మలుచుకుని.. వాటి ద్వారా కేసీఆర్ తాను చేసిన పాపాలన్నిటికీ ప్రక్షాళన చేసుకోవాలని కలలు కంటున్నారు. అంటూ విజయశాంతి విరుచుకు పడ్డారు.
 

ప్రభుత్వ ఖజానాను ముంచేసి - ఇంతకాలం మాయమాటలు చెప్పిన సీఎం దొరగారు... ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నిజాలను ఒప్పుకోక తప్పలేదు అని విజయశాంతి వ్యాఖ్యానించారు. ఇంతకాలం ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటపడి... ఆయన అసలు స్వరూపం వెలుగులోకి వచ్చేరోజు తొందరలోనే ఉందని... ఆరోజు కోసమే తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తున్నారని.. అంటూ ఘాటుగా స్పందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: