డిసెంబర్ 21 సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం. ఈ రోజు ఆయన అభిమానులకు పండుగ రోజే. ఆయన పుట్టిన రోజు అనంతపురం జిల్లాలోని ధర్మవరం చేనేతల మధ్య జరుపుకుంటానని ప్రకటించి .. నేతన్నలపై తన అభిమానం చాటుకున్నారు సీఎం వైఎస్ జగన్. కష్టానికి దేవుడు ఫలితం ఇచ్చాడు. ఆ ఫలాలను ప్రజలకు పంచే పనిలో జగన్ బిజీగా ఉన్నారు. వైఎస్ జగన్ జనం చెక్కిన శిల్పం. అందుకే..ఆ శిల్పంలో ఎక్కడా తాకిన ప్రజల హృదయస్పందనే వినిపిస్తుంది. జగన్కి విజయం వెన్నుపోటుతో రాలేదు. దాని వెనుక పదేళ్ల కఠోక శ్రమ ఉంది. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంది. ఆ తపనే ఇప్పుడు ఆలోచనలై ఆరు నెలల పాలనలొనే శభాష్ అనిపించుకుంటున్నారు. ఇప్పటికే 60శాతానికిపైగా మేనిఫెస్టోను అమలు చేశారు. ఏపీ దిశ యాక్ట్ను తీసుకొచ్చారు, గ్రామ సచివాలయ వ్యవస్థకు ప్రాణం పోశారు, జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు, రివర్స్ టెండరింగ్తో ప్రజా ధనానికి భరోసా, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పోలీసులకు వీక్లీ ఆఫ్లు, వైద్యం ఖర్చు 1000 దాటితే ఆరోగ్య శ్రీ, రైతు భరోసా, ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరించడం, అమ్మ ఒడి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం వంటి నిర్ణయాలతో శరవేగంగా దూసుకెళ్తున్నారు. శీతాకాలపు అసెంబ్లీ సమావేశాల్లో నలభై ఏళ్ల అనుభవాన్ని తన వ్యూహాలతో నలిపేసి రాజకీయ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు వైఎస్ జగన్.
బాగా గుర్తు.. మహానేత వైఎస్ఆర్ చనిపోయిన రోజులవి. తెలుగు నేల గుక్క పట్టి ఏడుస్తుంది. పావురాల గుట్టు స్మృతులు చెదిరిపోలేదు. మహానేత అకాల మరణంతో వందల గుండెలు పగిలిపోయాయి. కోట్ల కళ్లు కాలువలై ప్రవహించాయి. తెలుగు నేల మీద ఓ నిశ్శబ్దం. అంతుచిక్కని నిశ్శబ్ధం. మనసు పొరల్లో రాజన్న గుర్తులు శిలాక్షరాలై ఉన్నాయి. ఏ పథకాన్ని అడిగినా, తడిమినా రాజన్నే గుర్తుకు వస్తున్నాడు. ఓ మహానేతను కోల్పోయి..దిక్కులేని ప్రజానీకానికి అన్నగా అండగా ఉండాలనుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొడుకుగా తన తండ్రి ఆశయాలు, లక్ష్యాలకు వారసుడు కావాలనుకున్నాడు. తన తండ్రి మరణంతో ఆగిన గుండెలను పలకరిస్తానని పావురాల గుట్ట సాక్షిగా ప్రమాణం చేశాడు. తెలుగు నేలకు మాట ఇచ్చాడు. పావురాల గుట్ట సాక్షిగా చేసిన ప్రమాణానికి 'ఓదార్పు యాత్ర' అని నామకరణం చేసి ప్రజల్లోకి వచ్చారు వైఎస్ జగన్. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభమైంది. ప్రజల నుంచి ఊహించని స్పందన. రాజన్న కొడుకును చూడటానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు.
మహిళలైతే జగన్లో అన్నని తమ్ముడిని చూసుకున్నారు. వృద్ధులు ఓ మనవడ్ని చూసుకుటే.. యవత భవిష్యత్తును నిర్మించే నాయకుడ్ని చూసింది. పల్లెలు, పట్టణాలు మీదుగా ఓదార్పు యాత్ర సాగిపోతుంది. ఇక్కడే రాజకీయ రాబందులు ఒళ్లు విరుచుకున్నాయి. టెన్ జన్పథ్కు చాడీలు నూరిపోశాయి. అంతే... న్యూఢిల్లీలోని అక్బర్ రోడ్ కళ్లు మూసుకుపోయాయి. ఓదార్పు యాత్ర ఆపండని హుకుం. జగన్ మాములోడు కాదు. ఈ విషయం చంద్రబాబుకు తెలుసు. అప్పటికే ఓదార్పు యాత్రకు వస్తున్న స్పందనను బాబు అంచనా వేసుకున్నాడు. వైఎస్ జగన్ రాజకీయంగా ఎదిగితే తండ్రిని మించిన లీడర్ అవుతాడని అంచనాకు వచ్చాడు. జగన్ను రాజకీయంగా తొక్కేందుకు స్కెచ్ వేశాడు. కాంగ్రెస్తో కుమ్మక్కు అయ్యాడు. చిదంబరం చెవిలో చాడీలు చెప్పాడు. అప్పటికే కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వైఎస్ జగన్పై కేసులు పెట్టారు. వేధించారు.. విచారణకు అని పిలిచి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అయినా.. నమ్మకాన్ని, పట్టుదలను కోల్పోలేదు జగన్. జైల్లో ఉంటూనే పార్టీని నడిపించాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత మళ్లీ పాదయాత్ర మొదలు పెట్టారు వైఎస్ జగన్.
"చలికాలం.. పైగా బంగ్లాఖాతంలో అల్పపీడనం.. చిరు జల్లులు పడుతున్నాయి..అలుపెరగకుండా ఓదార్పు యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతుంది. సమయం రాత్రి 12 దాటింది. అయినా ఓదార్పు యాత్ర కొనసాగుతూనే ఉంది. ఎక్కడో మారుమూల పల్లెలో చిన్న గుడిసెలో ఉన్నవారిని జగన్ ఓదార్చాలి..షెడ్యూల్ ప్రకారం ఆరు గంటలకే అక్కడికి చేరుకోవాలి..కాని జనాభిమానంతో ఓదార్పు యాత్ర లేట్ అవుతూ వచ్చింది. వారిని రేపు పరామర్శిద్దామని వైఎస్ఆర్ సీపీ నేతలు జగన్కు చెప్పారు. జగన్ ససేమిరా అన్నారు. ఆ చలిలో..ఆ వానలో.. ఆ అర్ధరాత్రి.. పూరి గుడిసెలో ఉన్నవారిని పరామర్శించారు. అప్పటికే జగన్ తడిచిపోయి ఉన్నారు. గజగజ వణుకుతున్నాడు. ఆ కుటుంబాన్ని పరామర్శించి.. వారి పెట్టిన పెరుగు అన్నం తిని ఆ రోజు ఓదార్పు యాత్ర ముగించారు వైఎస్ జగన్".
చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మడం..మోదీ హవా, పవన్ కల్యాణ్ ప్రభావంతో కేవలం 5 లక్షల ఓట్లతో వైఎస్ జగన్ సీఎం పీఠానికి దూరమయ్యారు. ఓడిపోయినా జగన్ కృంగిపోలేదు. ఛాలెంజ్గా తీసుకున్నాడు. మళ్లీ ప్రజల దగ్గరకే వెళ్లాడు. వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ చంద్రబాబు ప్రభుత్వంపై సమర శంఖం పూయించారు. ప్రత్యేక హోదా తీసుకు వస్తానని చంద్రబాబు హ్యాండ్ ఇవ్వడం. అమరావతి విషయంలో చంద్రబాబు తప్పులు, రైతు రుణమాఫీ సరిగా చేయకోవడం ఇవన్నీ నారావారి పాలనపై వ్యతిరేకతను బాగా పెంచాయి. ఈ వ్యతిరేకతను పాదయాత్రతో ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్లారు వైఎస్ జగన్. ఇడుపులపాయ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఇచ్చాపురం వరకు కొనసాగింది.
పాదయాత్రలో వైఎస్ జగన్ వేసిన ప్రతి అడుగు ప్రత్యర్ధుల గుండెల్లో ఓ అగ్నిజ్వాలైతే.. ప్రజల గుండెలకు ఆత్మీయ పలకరింపులు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మూడు కాలాలను ముద్దాడింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదాలు ప్రతి జిల్లాను ముద్దాడటమే కాదు..కృష్ణా, గోదావరి నదమ్మల ఆశీర్వాదం పొందాయి. 'అమ్మ ఒడి' పథకం గురించి వైఎస్ జగన్ పాదయాత్ర సమయం నుంచే ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఓ 20 మంది మహిళలు కనబడితే చాలు 'అమ్మ ఒడి' పథకం దాని విధివిధానాలు గురించి వివరించేవాడు. మన పిల్లలు కలెక్టర్లు, డాక్టర్లు కావాలని ఆ తల్లులకు ఎంతో అర్ధమయ్యేలా చెప్పేవారు. పాదయాత్రలో వేల మంది వచ్చి మీద పడుతున్నా నవ్వుతూ ముందుకు కదిలేవారు.