వైసీపీ- బీజేపీ సంబంధాలు విచిత్రంగా ఉంటున్నాయి. ఒకసారి ఈ రెండు స్నేహితుల్లా ఉంటున్నాయి. మరోసారి శత్రువుల తరహాలో ప్రవర్తిస్తున్నాయి. ప్రస్తుతానికి మాత్రం బీజేపీ- వైసీపీ మధ్య అంత సఖ్యత కనిపించడం లేదు. అవసరం కొద్దీ కొన్ని బిల్లుల విషయంలో బీజేపీకి వైసీపీ మద్దతు ఇస్తున్నా.. రాష్ట్ర విషయాలకు వచ్చేసరికి జగన్ మోడీతో తీవ్రంగానే విబేధిస్తున్నారు. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీతో కయ్యానికి జగన్ సిద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది.

 

అసలు విషయం ఏంటంటే.. విశాఖ స్టీల్‌ ప్టాంట్‌కు చెందిన 3400 ఎకరాల భూమిని పోస్కో సంస్థకు కేటాయించాలని ఇటీవల కేంద్రమత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఓ ప్రకటనలో అన్నారు. దీన్ని వైసీపీ తీవ్రంగా విబేధిస్తోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేస్తే చూస్తూ ఊరుకోమని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు గట్టిగానే చెబుతున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

స్టీల్‌ ప్టాంట్‌కు చెందిన 3400 ఎకరాల భూమిని పోస్కో సంస్థకు కేటాయించాలన్న కేంద్రమత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటనను వ్యతిరేకిస్తున్నామని దాడి వీరభద్రరావు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కొరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.4,890 కోట్లు కేటాయిస్తే కేంద్రానికి పన్నుల రూపంలో స్టీల్ ప్లాంట్ రూ.40,500 కోట్లు చెల్లిందని దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. రెండు లక్షల కోట్ల విలువైన భూమిని విదేశీ ప్రైవేటు సంస్థలకు రూ.4849 కోట్లకు సెబీ కట్టబెట్టే యత్నం చేస్తోందని ఆరోపించారు.

 

విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఇనుప గనులు కేటాయించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని కేంద్రం టాటా, జిందాల్ లాంటి ప్రైవేటు కంపెనీలకు గనులు కేటాయించిందని దాడి వీరభద్రరావు మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతోందని దాడి వీరభద్రరావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే 1970 తరహాలో మరో మారు భారీ ఉద్యమం తప్పదని వీరభద్రరావు హెచ్చరించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: