రాష్ట్రంలో జరుగుతున్న మహిళలు, పిల్లలపై వరుస దారుణాలపై, అఘాయిత్యాలను ఉద్దేశించి తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఇలాంటి దారుణాలు జరగటం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేసారు. అత్యాచారాల లాంటి నేరాలకు ఉరి శిక్ష వేయడం, కాల్చి చంపడం అనే శిక్షలు శాశ్వత పరిష్కారం కావన్నారు. దిశ లాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే.. మొట్టమొదట సమాజంలో మార్పు రావాలన్నారు.

 

‘సెల్ ఫోన్లు, టీవీలు, టెక్నాలజీ మనిషి బాగు పడటం కోసం, సుఖమయ జీవనం కోసం ఉపయోగపడాలి. కానీ, ప్రస్తుతం అవే మానవ జీవితాన్ని నాశనం చేస్తున్నాయి. మనిషి సృష్టించిన టెక్నాలజీయే అతడిని నాశనం చేస్తోంది. ఈ విధ్వంసాన్ని మనిషి ఊహించలేకపోయాడు’ అని ఈటల రాజేందర్ అన్నారు. 

 

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం (డిసెంబర్ 14) ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ‘మానవ వికాస వేదిక మహా సభ’లో ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరుగుతున్న దారుణాలతో చాలా మంది తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారని ఈటల రాజేందర్ అన్నారు. వారు బయటకు వెళ్లి క్షేమంగా తిరిగొస్తారో లేదో అని భయపడుతున్నారని చెప్పారు. కంచె చేను మేసినట్లుగా తన పిల్లల పైనే తండ్రి క్రూర మృగంగా ప్రవర్తిస్తున్నారని.. ఆడబిడ్డలకు సొంత ఇంట్లోనే రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
నాగరికతా ప్రపంచంలో మానవ సంబంధాలు నాశనం అయ్యాయని మంత్రి ఈటల అన్నారు. మనిషికి, జంతువులకు ప్రధాన తేడాలను గమనించాలని ఆయన సూచించారు. టెక్నాలజీ ఇంత పెరిగినా కూడా  సమాజంలో మూఢ నమ్మకాలు, మంత్రాల నెపంతో మనుషులను చంపడం దుర్మార్గమని, అరాచకమని ఇలాంటి అనాగరికమైన సంఘటనలు ఇక మీదట జరగకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. మానవ వికాస వేదిక లాంటి సంస్థలు ప్రజలను చైతన్య పరచాలని ఆయన కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: