ఇది పంట చేతికి వచ్చే కాలం. ఈ కాలంలోనే పంటలకు బెడద ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కోతుల నుంచి, ఇతర జంతువుల నుంచి బెడద ఎక్కువగా ఉంటుంది. కోతులను ఊరి నుంచి పంట పొలాల నుంచి తరిమికొట్టాలి అంటే మాములు విషయం కాదు. ఒకవేళ పంటల చుట్టూ కరెంట్ తీగలు కడితే... దాని వలన కోతుల కంటే కూడా మనిషికే ఎక్కువగా డేంజర్ ఎందుకంటే పొరపాటున కరెంట్ తీగ పట్టుకుంటే షాక్ కొట్టి చనిపోయే అవకాశం ఉంటుంది.
ఇటీవల ముగ్గురు ఇలానే మరణించారు. అందుకే గ్రామ ప్రజలు కొంత తెలివిగా అలోచించి రాజమండ్రి నుంచి రెండు కొండముచ్చులను కొనుగోలు చేసి గ్రామానికి తెచ్చుకున్నారు. ఆ రెండు కొండముచ్చులు గ్రామంలో ప్రతి ఒక్కరికి దగ్గరయ్యాయి. అందరితో కలిసిపోయాయాయి. గ్రామంలోకి వచ్చే కోతులను తరిమికొడుతున్నాయి. ఆలా గ్రామంలోని కోతులను తరిమి కొట్టడమే కాకుండా... పంటపొలాల నుంచి కూడా వాటిని దూరంగా తరిమి కొట్టడంతో కోతులు పరుగులు తీస్తున్నాయి.
కాగా, ఇప్పుడు ఆ గ్రామంలో కోతుల బెడద తగ్గిపోయింది. రెండు కొండముచ్చులు వాటి పనిని సక్రమంగా నిర్వహిస్తున్న సమయంలో ఒక కొండముచ్చుకు అనారోగ్యం చేసింది. దీంతో ప్రజలంతా కలిసి దానిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించింది. దీంతో గ్రామం మొత్తం షాక్ అయ్యింది. చనిపోయిన కొండముచ్చును అద్భుతంగా అలంకరించారు.
దానికి ఇష్టమైన వస్తువులను దాని చుట్టూ ఉంచారు. తప్పేట్లు మేళాలతో కొండముచ్చును ఊరేగింపుగా తీసుకెళ్లి సమాధి చేశారు. ఆ కొండముచ్చుకు గుర్తుగా గ్రామంలో విగ్రహం ఏర్పాటు చేయబోతున్నట్టు గ్రామస్తులు చెప్తున్నారు. తమ గ్రామానికి కొండముచ్చు ఎంతో మేలు చేసిందని, ఆ మేలు ఎప్పటికి మరిచిపోలేమని అంటున్నారు. కొండముచ్చు వలన గ్రామంలో కోతుల బెడద తగ్గిపోయిందని అంటున్నారు సిద్ధిపేట జిల్లా నర్సాపూర్ గ్రామస్తులు.