అవి రెండూ...దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఘటనలు. ఇందులో ఒకటి దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా...మరొకటి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జరిగింది. మొదటి సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించడమే కాకుండా...ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పరువును బజారున పడేయగా....మరొకటి తెలుగు రాష్ట్రాల్లో ఆడబిడ్డలున్న కుటుంబ సభ్యుల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ రెండు ఘటనలే నిర్భయ అత్యాచారం, హత్య. దిశ దారుణ హత్యాచారం. ఈ రెండు ఘటనలో...మొదటి దుర్మార్గపు ఘటన బాధితురాలైన నిర్భయ తల్లి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన బిడ్డ గురించి మాట్లాడుతూ...హైదరాబాద్ దిశ ఘటనలో న్యాయం జరగలేదన్నారు.
డిసెంబర్ 16 నాటికి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ ఘటన జరిగి ఏడేళ్లు అవుతోంది. అయినప్పటికీ బాధితురాలికి ఇంకా న్యాయం జరుగలేదు. ‘నిర్భయ’ తల్లిదండ్రులు ఈ ఉదంతంపై స్పందిస్తూ, . ‘నిర్భయ’ కేసులో నలుగురు దోషులకు త్వరలో ఉరిశిక్ష అమలుచేయవచ్చని జోరుగా వార్తలు వెలువడుతుండటంతో ఇకనైనా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని, అయినప్పటికీ దోషులకు డెత్ వారెంట్ జారీచేసి ఉరిశిక్ష తేదీని ఖరారుచేసే వరకు ఇలాంటి వార్తలను నమ్మలేమని ఆమె అన్నారు.తాము కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతామని, కన్న కూతుర్ని కోల్పోయి ఎంతో క్షోభకు గురైనప్పటికీ భగవంతునిపై విశ్వాసాన్ని కోల్పోలేదని, తమకు దేవుని అండ ఉన్నదని ‘నిర్భయ’ తండ్రి చెప్పారు. ‘నలుగురు నిందితులకు ఉరిశిక్ష అమలుచేయడం ద్వారా నిర్భయకు న్యాయం జరుగుతుంది. కానీ నిర్భయ లాంటి బాధితులు దేశంలో ఎంకా ఎంతోమంది ఉన్నారు. వారికోసం మా పోరాటాన్ని కొనసాగిస్తాం’ అని ఆయన స్పష్టంచేశారు.
ఇక సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసు గురించి నిర్భయ తల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు నలుగురు నిందితులను హైదరాబాద్ పోలీసులు ఎన్కౌంటర్ చేయడంతో బాధితురాలికి సత్వర న్యాయం జరిగిందని సంతోషిస్తున్న ప్రజలతో మీరూ ఏకీభవిస్తారా? అని ప్రశ్నించగా.. ఈ కేసులో ఆ యువతిని కాల్చిచంపినందుకు నిందితులను శిక్షించలేదని, కనుక ‘దిశ’కు న్యాయం జరుగలేదని, కానీ ఆమె కుటుంబానికైనా శాంతి చేకూరిందని భావిస్తున్నానని ‘నిర్భయ’ తల్లి చెప్పారు.