ఈ రోజుతో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు కి చేరాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు అధ్యక్షతన ప్రతిపక్ష ఎమ్మెల్యే లు నిరసన చేపట్టారు. సోమవారం రాష్ట్రంలో రివర్స్ పాలన- తిరోగమనంలో రాష్ట్ర అభివృద్ధి అంశంపై టీడీపీ వినూత్నంగా ఆందోళనలు చేపట్టారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సచివాలయం ఫైర్ స్టేషన్ నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు. వెనక్కి నడుస్తూ నిరసన తెలియజేశారు. చంద్రబాబు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి రివర్స్ వాక్ చేశారు.


అసెంబ్లీ సమావేశాలు ఆరు రోజులుగా జరుగుతున్నాయి. రోజుకో అంశం పై వినూత్నంగా టీడీపీ ఆందోళనలు చేపడుతోంది. ఉల్లి ధరలు, రైతుల సమస్యలు, 2430 జీవో, ఆర్టీసీ ఛార్జీల పెంపు, రివర్స్ టెండరింగ్ ఇలా కీలకమైన అంశాల పై నిరసన తెలియజేసింది టీడీపీ పార్టీ. రోజుకో విధంగా వినూత్న రీతిలో చంద్రబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు.


రాష్ట్రంలో టెండర్లన్ని రిజర్వు చేసుకుని రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో అబద్దాలు చెబుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 2 లక్షల కోట్ల విలువైన అమరావతిని చంపేశారని రాష్ట్రంలో ఉన్మాది పాలన తుగ్లక్‌ పాలన నడుస్తోందని ఘాటు విమర్శలు చేశారు. పెట్టు బడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని మనకు రాజధాని లేకుండా చేశారని చంద్రబాబు మండి పడ్డారు. అలాగే రాష్ట్రంలో రివర్స్ పాలనకు వ్యతిరేకంగా టీడీపీ అసెంబ్లీ వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టింది.


ఇదిలా ఉంటే ఇవాళ అసెంబ్లీలో 13 బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. ఎస్సీ కమిషన్ బిల్లు, ఎస్టీ కమిషన్ బిల్లు, ఎక్సైజ్ చట్టంలో సవరణలకు సంబందించి రెండు బిల్లులు, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుతో పాటు మొత్తం 13 బిల్లులకు ఆమోదం తెలపనున్నారు. అలాగే నూతన మద్యం విధానంపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: