ఎన్నికల్లో ఓడిపోయిన దగ్గర నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు మాట తీరులో గానీ, చేతల్లో గానీ చాల మార్పు వచ్చింది. ఆయన ఏం చేస్తున్నారో కూడా ఎవరికి అర్ధం కావడం లేదు. జగన్ ప్రభుత్వం మీద పోరాటాలు అంటూ పనికిమాలిన ప్రయోగాలు అన్ని చేస్తున్నారు. అయితే బాబు ఏం చేసిన అవి ప్రజలకు రీచ్ కాకపోగా, ప్రజల్లో చులకన అవుతున్నాయి. ఇక ఇలాగె బాబు తాజాగా ఓ కార్యక్రమం చేసి మరి వెటకారం అయిపోయారు.
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బాబు రోజుకో పేరుతో ఆందోళన కార్యక్రమం చేసుకుంటూ అసెంబ్లీ కి వస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం కూడా బాబు అసెంబ్లీ సమావేశాలకు అలాగే వచ్చారు. అయితే జగన్ రివర్స్ పాలన కొనసాగిస్తున్నారంటూ బాబు రివర్స్ వాక్ చేసుకుంటూ వచ్చారు. ఇక ఈయన తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వెనక్కి నడుస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్ సర్కార్పై నిప్పులు చెరిగారు.
టెండర్లన్నీ రివర్స్ చేసుకుని.. రివర్స్ టెండరింగ్ అంటూ అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు. సుమారు రూ.2 లక్షల కోట్ల విలువైన రాజధాని అమరావతిని చంపేసి.. రివర్స్లో పాలన సాగిస్తున్నారన్నారు. వైసీపీ తుగ్లక్ పాలన కారణంగా ఉన్న పరిశ్రమలు పారిపోయే పరిస్థితి ఏర్పడటమే కాకుండా.. విదేశీ పెట్టుబడులు సైతం రాని పరిస్థితిని కల్పించారని వాపోయారు.
అయితే ప్రభుత్వం పై పోరాటాల పేరుతో ఆందోళనలు చేయొచ్చు కానీ... ఈ విధంగా చేస్తే అపహాస్యం పాలవుతారని జనం మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ఇలాంటి వేషాలకు జనాలు ఇంప్రెస్ కూడా అవ్వరు. బాబు ఎన్నికల్లో ఓటమి తర్వాత చేస్తోన్న పనులు అన్ని కామెడీగా మారుతున్నాయి. ఏ విషయంలో అయినా బాబు తన హోదాకు తగ్గట్టు గా వ్యవహరించడం లేదని సామాన్య జనాలే విమర్శిస్తున్నారు. మరి బాబు తీరు ఎప్పటకి మారుతుందో ? చూడాలి.