దళిత వర్గాలకు ఆర్థికాభివృద్ధి జరిగినప్పుడే న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే తిప్పేస్వామి పేర్కొన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కమిషన్ విభజించేందుకు చట్టసభలో బిల్లు ప్రవేశపెట్టడం చాలా సంతోషకరం అని అన్నారు. ఇంత ప్రాధాన్యత కలిగిన బిల్లు సభలో ప్రవేశపెట్టి చర్చ జరుతుంటే ప్రతిపక్ష సభ్యులు గైర్హాజరు కావడం ఎంతో విచారకరం అని చెప్పారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు బాగా వెనుకబడ్డారని రాజ్యాంగంలోని 338 ఆర్టికల్లో చాలా స్పష్టంగా చెప్పారు. స్వాతంత్రం వచ్చి ఇన్నాళ్లు అయినా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి జరగలేదని కేంద్రం గుర్తించి 1990లోని 68వ రాజ్యంగ సవరణ చేసి ఎస్సీ, ఎస్టీ కమిషన్ తీసుకోని వచ్చింది అని చెప్పారు. దేశంలో ఉండే ఎస్సీ, ఎస్టీలు అభివృద్ధి జరగాలన్నదే ఈ కమిషన్ ఉద్దేశం. ఆ తరువాత కూడా వాళ్ల స్థితి గతులు ఆశించినంతగా మార్పు రాలేదు. 2003లో 89వ సవరణ చేసి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్లుగా విడగొట్టారు. మన రాష్ట్రంలో 2003లో స్టేట్ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేశారు.
అయినా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. వైయస్ జగన్ సీఎం అయ్యాక ఎస్సీ, ఎస్టీ కమిషన్లు విభజించి ఇంకా వేగంగా అభివృద్ధికి బిల్లు ప్రవేశపెట్టడం చాలా సంతోషకరం అని చెప్పారు. రాజ్యాంగంలో ఈ వర్గాలకు అనేక సదుపాయాలు కల్పించింది. పదేళ్లు రిజర్వేషన్లు మనస్ఫూర్తిగా ఇవ్వండని అంబేద్కర్ ఆ రోజు స్పష్టంగా చెప్పినా కూడా అనుకున్న రీతిలో అభివృద్ధి జరగలేదు.
మన ప్రభుత్వం వచ్చిన తరువాత మొట్ట మొదటి రోజే వైయస్ జగన్ దళిత వర్గాలకు మంత్రివర్గంలో పెద్దపీట వేయడం, డిప్యూటీ మంత్రులు, హోం మంత్రులను నియమించడం ఇదో చరిత్ర. మంత్రిత్వ శాఖలు కూడా ప్రాధాన్యత ఇవ్వడం శుభపరిణామం. ఈ ప్రభుత్వంపై దళితులకు నమ్మకం కలుగుతోంది. చాలా గ్రామాల్లో ఇప్పటికి దళితులకు ఆలయ ప్రవేశం లేదు. ఇటీవల ఒక ఎమ్మెల్యేను కూడా అవమానించారు. దేశంలో కుల వివక్షను రూపుమాపాలి. ఆర్థికాభివృద్ధి జరిగిన్నప్పుడే దళిత వర్గాలు బాగుపడుతాయి.