ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు (సోమవారం) ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో మద్యపాన నిషేధంపై ఆసక్తికర చర్చ జరిగింది. టీడీపీ సభ్యులు మద్యపాన నిషేధంపై మాట్లాడగా.. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని వైన్ షాపులతో ఎదురవుతున్న ఇబ్బందుల్నిస్పీకర్ ఎదుట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారని.. ఇప్పుడు దశలవారీ అంటున్నారు.. ఇది మాట తప్పడం కాదా అంటూ ప్రశ్నించారు భవాని. 


మద్యం విషయంలో ప్రభుత్వం తీరు చూస్తుంటే.. మద్యం నియంత్రిస్తున్నట్లు ప్రజలకు భ్రమ కల్పిస్తూ.. షాపులు తగ్గించామని చెబుతున్నారన్నారు టీడీపీ ఎమ్మెల్యే. మద్యంపై ప్రభుత్వాలకు లాభాలు వస్తున్నాయని.. ఇటు రేట్లు కూడా పెంచారని, షాపుల అద్దెలు భారీగా పెంచారని.. ఆ షాపులు కూడా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలవే అని విమర్శించారు. మద్యం షాపులు ఇళ్లు, ఆలయాలు, స్కూళ్ల మధ్యలో ఉన్నాయని.. చాలామంది మహిళలు తనకు ఫిర్యాదు చేశారన్నారు. 

 

మద్యం షాపుల విషయాన్ని అధికారులకు చెప్పినా చర్యలు తీసుకోకపోవడంతో మహిళలు ఆందోళనలు చేశారని..గుర్తుచేశారు. ఎక్సైజ్ సిబ్బంది కొరతతో తనిఖీలు తూతూమంత్రంగా జరుగుతున్నాయన్నారు టీడీపీ ఎమ్మెల్యే భవాని. షాపుల్లో పనిచేసేవాళ్లు బయట మద్యం అమ్మకాలు చేస్తున్నారని.. బెల్ట్‌ షాపులకు మద్యం వెళుతోందని విమర్శించారు. యువతకు మంచి కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి.. ఇలా వైన్ షాపుల్లో ఉద్యోగాలు ఇవ్వడం సరికాదన్నారు. 

 

గతంలో చాలా బ్రాండ్స్ ఉండెవి... ఇప్పుడు చాలా తగ్గించారన్నారు ఆదిరెడ్డి భవాని. ఇలా మద్యం బ్రాండ్ల విషయాన్ని ప్రస్తావించగానే.. స్పీకర్ తమ్మనేని సీతారాం స్పందించారు. ‘నీకెందుకు తల్లీ ఆ బ్రాండ్స్ విషయం.. వాళ్లు మాట్లడతారు వదిలేయ్’ అనడంతో సభలో సభ్యులంతా పెద్దగా నవ్వారు. తర్వాత ఆమె తన ప్రసంగాన్ని ముగించారు.తరువాత మద్యనిషేధం అంశంపై నగరి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. సీఎం జగన్‌పై ప్రశంసలు గుప్పించారు. గాంధీ ఆశయ సాధనకు జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచి ఆ పని చేస్తున్నారన్నారు. గత ఐదేళ్ల నారా వారి సారా పాలన నుంచి మహిళలకు విముక్తి లభించిందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మద్యపాన నిషేధం కోసం జగన్ సర్కారు చేస్తున్న కృషిని రాష్ట్రంలోని ప్రతి మహిళా అభినందిస్తోందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: