ఏపీ ప్రభుత్వం మహిళకు సంబంధించిన కేసుల సత్వర విచారణకు దిశ బిల్లును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం తెలిపారు. దీంతో ఈ బిల్లుపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతోంది. జగన్ సర్కార్‌పై మహిళా సంఘాలు కూడా ప్రశంసల వర్షం కూడా కురిపిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లోనూ ఈ బిల్లును తీసుకురావాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది.. కొన్ని రాష్ట్రాలు ఈ బిల్లుపై ఆసక్తి చూపిస్తున్నాయి.

తాజాగా దిశ బిల్లుపై ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆరా తీస్తోంది. ఈ బిల్లుకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని ఢిల్లీ అసెంబ్లీ కోరింది. ఈ విషయాన్ని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అసెంబ్లీలో ఈ విషాయాన్ని తెలియజేశారు. ఏపీ అసెంబ్లీ ఆమోదించిన దిశ బిల్లుపై ఢిల్లీ ప్రభుత్వం ప్రశంసలు కురిపించిందని.. ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను అభినందించారని.. బిల్లు కాపీలు కావాలని కోరినట్లు చెప్పారు. తాను కూడా సీఎం, ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలను అభినందిస్తున్నానని స్పీకర్ తమ్మినేని తెలిపారు.

జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దిశ బిల్లుకు ఏపీ అసెంబ్లీ గత శనివారం ఆమోదం తెలిపింది. ప్రతిపక్షం టీడీపీ కూడా బిల్లుకు మద్దతు తెలపగా.. బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ తమ్మనేని సీతారాం ప్రకటించారు.ఈ బిల్లు ప్రకారం పక్కా ఆధారాలు ఉంటే.. అత్యాచార కేసుల దర్యాప్తును వారం రోజుల్లో పూర్తి చేయడంతోపాటు.. 14 రోజుల్లో కోర్టు విచారణ పూర్తి చేసి.. 21 రోజుల్లోనే శిక్షలు ఖరారవుతాయి.

మొన్నటి వరకు ఈ కేసుల విచారణకు 4 నెలల సమయం పడుతుండగా.. ఇక నుంచి మూడు వారాల్లోనే తీర్పు వెలువడుతుంది. అలాగే మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించిన కేసుల విచారణ కోసం జిల్లాకో కోర్టు చొప్పున ఏర్పాటు చేయనున్నారు. ఈ న్యాయస్థానాలు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లా పని చేస్తాయి. మహిళలు, చిన్నారులపై జరిగిన నేరాలను మాత్రమే ఈ కోర్టుల్లో విచారణ జరుగుతున్నాయి.

మహిళలు, చిన్నారులను కించపరుస్తూ.. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటారు. మొదటిసారి తప్పు చేస్తే రెండేళ్లు, రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధిస్తారు. చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం గరిష్టంగా ఐదేళ్ల శిక్ష మాత్రమే పడుతుంది. కాగా.. నేరాల్లో తీవ్రతను బట్టి వారికి గరిష్టంగా జీవిత ఖైదు విధించేలా బిల్లు రూపొందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: