దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి, కొన్ని చోట్ల ఇవి హింసాత్మకంగా మారుతున్నాయి. అటు ఈశాన్య నుంచి ఇటు దక్షిణాది వరకు నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అస్సాం, పశ్చిమ బెంగాల్,ఢిల్లీలకే కాకుండా ఇతర ప్రాంతాలకి వ్యాపించాయి. మన హైదరాబాద్లోనూ తీవ్రమయ్యాయి. బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా ఉస్మానియా క్యాంపస్లో సోమవారం (డిసెంబర్ 16) విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఢిల్లీలోని జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. విద్యార్థులపై పోలీసుల చర్యను తప్పుబడుతూ ప్లకార్డులు ప్రదర్శించారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా అటు మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (ఎంఏఎన్యూయూ)లోనూ విద్యార్థులు ఆందోళన కొనసాగించారు. జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) వర్సిటీ విద్యార్థులకు మద్దతుగా నినాదాలు చేస్తూ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శించారు. జేఎంఐ విద్యార్థులపై దాడిని ఖండిస్తూ ఆదివారం అర్ధరాత్రి నుంచే ఎంఏఎన్యూయూలో నిరసనలు పెల్లుబికుతున్నాయి. సోమవారం ఉదయం యూనివర్సిటీ గేటుకు తాళాలు వేసి నిరసన చేపట్టారు. జేఎంఐ విద్యార్థులపై పోలీసుల లాఠీ ఛార్జీని ఖండించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనలు మన్నంటాయి. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఐఐటీ బొంబాయి, ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్ విద్యార్థులు జామియా మిలియా వర్సిటీ విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. పోలీసులు తమతో అసభ్యంగా ప్రవర్తించారని.. బాత్రూమ్లలోకి కూడా వచ్చి దాడి చేశారని జేఎంఐ విద్యార్థినిలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనూ ఆందోళనలు కొనసాగాయి. స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి 12 గంటల నుంచే నిరసనలు చేపట్టారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.