దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావో జిల్లాలో జరిగిన అత్యాచార ఘటనలో ఢిల్లీ హైకోర్టు కులదీప్ సింగ్ సెంగార్ ను దోషిగా తేల్చింది. ప్రజాప్రతినిధి అనే మాటకు చెడ్డ పేరు తెచ్చిన ఎమ్యెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ కు కోర్టు ఏ శిక్ష విధిస్తుందో అని సర్వత్రా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. 

 

ఉన్నావో ఘటన కథ ఇదే 

 

ఉత్తర్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉన్నావో జిల్లాకు చెందిన ఒక మైనర్ బాలిక 2017వ సంవత్సరంలో ఉద్యోగానికి గానూ ఎమ్యెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ ఇంటికి వెళ్తే ఆయన తనను రేప్ చేసారంటూ బాలిక ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించి బాలిక పోలీసులకు పిర్యాదు చేసింది కానీ పోలీసులు మాత్రం ఎమ్యెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చలేదు. దీనితో కోర్టును ఆశ్రయించింది బాలిక, ఆ తరువాత కొద్ది రోజులకు ఎమ్యెల్యే కుల్దీప్ సింగ్ సోదరుడు అతుల్ సింగ్ మరియు బాలిక తండ్రికి మధ్య ఘర్షణ జరగడంతో బాలిక తండ్రిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు, పోలీసుల కస్టడీలోనే బాలిక తండ్రి అనుమానాస్పదంగా మరణించడంతో సోషల్ మీడియాలో పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

 

మరికొద్ది రోజుల తరువాత ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన వ్యక్తి కూడా చనిపోయాడు. కావాలనే ఘటనకు సాక్షులుగా ఉన్న వ్యక్తులను చంపుతున్నారని తనకు న్యాయం చేయాలంటూ బాలిక యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ నివాసం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దేశ వ్యాప్తంగా ఉన్నావో ఘటన మారుమ్రోగింది. ఈ ఘటనతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో యూపీ ప్రభుత్వం ఈ కేసును సిబిఐ కి అప్పగించింది. సిబిఐ తన చార్జిషీట్ లో ఎమ్యెల్యే కుల్దీప్ సింగ్ పేరును చేర్చింది.

 

కేసు ఇలా సాగుతుండగా బాలిక మరియు వారి కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారును ఒక పెద్ద ట్రక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలిక పిన్ని చనిపోగా బాలిక తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరింది. ఆక్సిడెంటుకు కారణమైన ట్రక్ ను ఎవరూ గుర్తించకుండా నెంబర్ ప్లేట్ కు  గ్రీజ్ పూసి ఉండడంతో తమ కుటుంబ సభ్యులను ఎమ్యెల్యే చంపడానికి చూస్తున్నారంటూ బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. సినిమాను తలపించిన ఈ కేసులో ఎమ్యెల్యే కుల్దీప్ ను ఢిల్లీ హైకోర్టు దోషిగా తేల్చింది. ఇంతటి దారుణానికి పాల్పడ్డ ఎమ్యెల్యేకు ఉరి శిక్ష వేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: