వరంగల్ లో 13 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ కు యత్నం..., ఖమ్మంలో మైనర్ విద్యార్ధినిపై కత్తితో దాడిచేసిన రౌడీషీటర్.., ఏలూరు...రేప్ బాధితురాల్నిచచ్చిపొమ్మని చెప్పిన స్నేహితుడు..., కుప్పంలో పదేళ్ల బాలికపై అత్యాచారం..... తెలుగు రాష్ట్రాల్లో ఆడపిల్లలపై ఆగని దారుణాలకు ఈ వరుస ఘటనలే నిదర్శనం. ఎన్ని చట్టాలు వచ్చినా..ఎన్ని శిక్షలు విధించినా ..మహిళలకు భద్రత లేకుండా పోతోంది. మూడు జిల్లాల్లో  జరిగిన ఘటనలు తల్లిదండ్రుల్లో..ముఖ్యంగా అమ్మాయిల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.  


ఉన్నావ్...దిశ...సమత...కొద్దిరోజులుగా  ఈ దారుణాలపైనే దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఫాస్ట్ ట్రాక్ కోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక చట్టాలు తెస్తున్నారు. మహిళల భద్రతపై యాప్ లు రూపొందించారు. పోలీసుల ప్రత్యేక నిఘాలు పెడుతున్నారు. అయినప్పటికీ  అమ్మాయిలకు భద్రత లేకుండానే పోతోంది. ఎక్కడోఒకచోట అఘాయిత్యాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.  జనం మధ్యే ఉండే మానవ మృగాలు ...అదును చూసి మహిళలపై పంజా విసురుతూనే ఉన్నారు. గత రెండు రోజుల్లోనే ఏపీ, తెలంగాణలో మైనర్ విద్యార్ధినులు, మహిళలపై జరిగిన దారుణాలే ఇందుకు ఉదాహరణ. చిత్తూరు, పశ్చిమగోదావరి, వరంగల్, కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకున్న అఘాయిత్యాలు కలకలం రేపుతున్నాయి.  

 

పశ్చిమ గోదావరి జిల్లాలో బాలిక ఆత్మహత్య కేసులో ఇప్పుడు కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. టి.నర్సాపురానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్ధినిపై మానికల రాజు అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ విషయాన్ని... తన స్నేహితుడైన సుబ్రహ్మణ్యానికి చెప్పింది.  అయితే అతడు వేరే విధంగా మాట్లాడి ఆ బాలిక మనసు నొప్పించాడు. దీంతో ఈనెల తొమ్మిదిన కూల్‌ డ్రింక్‌లో పురుగుల మందు కలుపుకుని తాగాందా బాలిక. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. తల్లిదండ్రులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి రాజు, సుబ్రహ్మణ్యాన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.


వరంగల్ లోనూ గ్యాంగ్ రేప్ యత్నం కలకలం రేపింది. పైగా నిందితుల తరఫున అధికార పార్టీకి చెందిన స్థానిక నేత ఒకరు వత్తాసు పలకడం చర్చనీయాంశంగా మారింది. ధర్మసాగర్ మండలం కరుణాపురం గ్రామంలో రెండు రోజుల క్రితం నలుగురు యువకులు మైనర్ బాలికను బలవంతం చేయడానికి  యత్నించారు. ఆటోలో మద్యం సేవిస్తూ పేకాట ఆడుతున్న  ఆ నలుగురు ..అటుగా వస్తున్న బాలికను గమనించి  చెయ్యి పట్టి బలవంతంగా  ఆటోలకి గుంజారు. ఆ అమ్మాయి చాకచక్యంగా వారిని నెట్టేసి ఆటోలో నుంచి తప్పించుకుంది. ఆటో నెంబరు గుర్తు పెట్టుకుని... తల్లిదండ్రులకు చెప్పింది. వారు భయపడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు  రెండు బృందాలుగా గాలించి.. ఆటోను, నలుగురు యువకులను పట్టుకున్నారు.  అయితే అధికార పార్టీకి చెందిన  నాయకుడు  బాధిత కుటుంబాన్ని తీవ్ర పదజాలంతో దూషించి.. మిమ్మల్ని చంపేస్తామంటూ బెదిరించాడు. దీంతో వారు భయంతో వణికిపోతున్నారు.

 

అటు కొత్త‌గూడెం జిల్లాలో రౌడీషీట‌ర్ రెచ్చిపోయాడు. మైన‌ర్ బాలికైన‌ ఇంట‌ర్ విద్యార్దినిని  ప్రేమ పేరుతో వేధించాడు. ఎదురుతిరిగిన‌ విద్యార్థినిపై క‌త్తి తో దాడికి పాల్పడ్డాడు.  ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలి కుటుంబం  కొత్త‌గూడెం వ‌న్ టౌన్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసింది. ర‌క్ష‌ణ‌ క‌ల్పించాల‌ని వేడుకుంది.  ఎస్ పి ఆదేశాల‌తో  రౌడీ షీట‌ర్ పై కేసు న‌మోదైంది. 


   
మరోవైపు చిత్తూరు జిల్లాలో వరుస అత్యాచారాలు కలకలం రేపుతున్నాయ్‌. తిరుచానూరు ఘటన మరువక ముందే.. కుప్పం రైల్వే స్టేషన్‌ సమీపంలో పదేళ్ల బాలికపై 16 ఏళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. స్కూలుకెళ్తున్న ఐదో తరగతి బాలికను ఇంటికి తీసుకెళ్తానని చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో యువకుడిని  పట్టుకుని పోలీసులకు అప్పగించారు స్థానికులు.

మరింత సమాచారం తెలుసుకోండి: