నారా లోకేష్...కుటుంబ రాజకీయాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీలో...మూడో తరం కుటుంబ నాయకుడు. తాత ఎన్టీఆర్ నుంచి తండ్రి చంద్రబాబు పార్టీని స్వీకరిస్తే...ఆయన నుంచి పార్టీ పగ్గాలు చేజిక్కించుకోవడం అనే లాంచన ప్రక్రియ ఒక్కటే పెండింగ్లో ఉన్న నేత. తెలుగుదేశం ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. రికార్డు స్థాయి ఓటమిని మూటగట్టుకుంది. ఆ పార్టీపై జరుగుతున్న ప్రచారం నిజమైతే...వచ్చే ఆరు నెలల్లో చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష నాయకుడి హొదా ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో సహజంగానే...ప్రాంతీయ పార్టీని నడిపించగలడా? అనే చర్చ లోకేష్ కేంద్రంగా జరుగుతోంది.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. వైఎస్సార్ సీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పోటీ పడటంతో ఈ నియోజకవర్గ రాజకీయం రసకందాయంగా మారింది. వాస్తవానికి ఇక్కడ తాము అభివృద్ధి చేసిన అమరావతి అంటూ టీడీపీ నేతలు ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. సహజంగానే టీడీపీ నేతలు లోకేష్ గెలుపుపై గట్టి ధీమా ప్రదర్శించారు. అయితే, లోకేష్ ఓడిపోయారు. దీనికి కారణం..పార్టీ అనడం కంటే...లోకేష్ తెలివితేటల గురించి ప్రజల్లో ఉన్న ఓ అభిప్రాయమే కారణమంటున్నారు. పోటీ చేస్తున్న మంగళగిరిని సైతం ఆయన స్పష్టంగా పలకలేకపోయారని స్థానికుల్లో ఉన్న ఆవేదన కారణమంటున్నారు.
ఇక మరో ముఖ్యమైన అంశం ఆయనపై సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్. లోకేష్ ప్రసంగాలపై సెటైర్ల మీద సెటైర్లు పడుతుంటాయి. ఆయనకు మాట్లాడడం రాదని, ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తెలియదని అంటున్నారు. అందుకే చినబాబు మాట్లాడటం కంటే ట్విట్టర్లోనే ఎక్కువగా కనిపిస్తుంటారని చెప్తుంటారు. ఏకంగా తెలుగు నేర్పించేందుకు ఓ శిక్షకుడిని పెట్టారంటే ఆయన సామర్థ్యం అర్థం చేసుకోవచ్చుంటున్నారు జనాలు. పార్టీలో ఆయన హంగామా తప్ప విషయం తక్కువేనని టీడీపీ నేతలు అంటుంటారు. పార్టీ వీడిన నేతలు, ఎమ్మెల్యేలు ప్రధానంగా లోకేష్ను టార్గెట్ చేస్తున్నారు మొత్తం లోకేష్ కేంద్రంగా జరుగుతున్న ఈ ఆశ్చర్యకర విశ్లేషణలు చూస్తుంటే పార్టీలో ఎమ్మెల్యే ఐదారుగురైనా మిగిలేది అనుమానమే అంటున్నారు.