దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.ఎస్ జగన్ సీఎం అయ్యారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. అందులోనూ వాళ్లిద్దరూ కష్టపడి పైకొచ్చారు. తమ తమ పార్టీలో కిందిస్థాయి నుంచి పైకి వచ్చారు. ప్రజలతో కూడా ఎన్నుకోబడ్డారు. ఇప్పుడు తమ తండ్రులతో సమానంగా రాజకీయాల్లో రాణిస్తున్నారు. మరి.. వాట్ ఎబౌట్ చంద్రబాబు సన్ లోకేశ్ బాబు. ఈ దేశంలో తనకన్నా సీనియర్ పొలిటికల్ లీడర్ లేడని గప్పాలు కొట్టుకునే చంద్రబాబు.. తన కొడుకు రాజకీయాల్లో రాణించేలా చర్యలు తీసుకోలేకపోతున్నారు. అసలు టీడీపీలో ఏం జరుగుతోంది? నారా లోకేశ్ ను ప్రజలు ఎందుకు తిరస్కరిస్తున్నారు. చంద్రబాబు.. లోకేశుడిని ఎంత పైకి తీసుకొద్దామనుకున్నా… ఆయన అంత కిందికి జారిపోతున్నారు. తన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్సీ హోదాలో.. మంత్రి పదవి ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం లేదు. పవర్ లేదు. అందుకే.. లోకేశ్ బాబు కేవలం ఎమ్మెల్సీగా మిగిలిపోయారు. 

 

వైఎస్సార్ కొడుకు ముఖ్యమంత్రి అయినప్పుడు.. కేసీఆర్ కొడుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పుడు.. తన కొడుకుకు కొడుకుకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తే తప్పేంటి… అని ఆలోచిస్తున్నారట చంద్రబాబు. అందులోనూ చంద్రబాబు వయసు 69 కి చేరింది. వచ్చే ఎన్నికల నాటికి 74 దాకా అవుతుంది. అప్పటికి తన ఆరోగ్యం సహకరించకపోతే ఎట్లా? లోకేశ్ భవిష్యత్తు ఎట్లా? తనకు చేతకాకపోతే టీడీపీని నడిపించేది ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికల్లో ఊహించని విధంగా ఘోర పరాజయం పొందింది తెలుగు దేశం పార్టీ. చంద్రబాబు తర్వాత నవ్యాంధ్ర ప్రదేశ్ లో పార్టీలో కీలకంగా వ్యవహరించే నేత ఎవరు అంటే నారా లోకేష్ అని పార్టీ వర్గాలు గళం విప్పినా.. లోకేష్ పార్టీని నడిపించగల సమర్ధుడు కాడని జోరుగానే ప్రచారం జరిగింది. దీంతో తన వారసత్వంపై నమ్మకంలేని మాజీ సీఎం పార్టీ భారాన్ని తానే మోస్తున్నారు. 

 

ఇదిలా ఉంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడిగా 2009లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్.. 2019లో సీఎం పీఠాన్ని అధిష్టించారు. ఈ ఘనవిజయం జగన్‌కు అంత తేలిగ్గా ఏం దక్కలేదు. కడప ఎంపీగా గెలుపొంది, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్.. ఈ పదేళ్లలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. అక్రమంగా లక్ష కోట్లు సంపాదించాడని విపరీతంగా ప్రచారం చేసినా.. కేసులు మోపు జైల్లో పెట్టినా.. అనుకున్న లక్ష్యం కోసం మొండిగా పోరాడారు. 2008లో సాక్షి దినపత్రిక ప్రారంభమైనప్పుడు జగన్‌ను అందరూ వైఎస్ కొడుకుగా, వ్యాపారవేత్తగా మాత్రమే చూశారు. 2009 ఎన్నికల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్.. కడప ఎంపీగా గెలుపొందారు. కానీ అదే కొద్ది నెలల వ్యవధిలోనే.. సెప్టెంబర్ 2న వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూశారు. వైఎస్ మరణం తర్వాత.. జగన్‌ని ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ.. ఎమ్మెల్యేలందరూ సంతకాలు చేసిన లేఖను పార్టీ అధిష్టానానికి పంపారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం జగన్‌ను సీఎం చేయడానికి అంగీకరించలేదు. వైఎస్ స్థానంలో రోశయ్యను ముఖ్యమంత్రిగా నియమించింది. రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ఆయన్ను అభిమానించే వందలాది గుండెలు ఆగిపోయాయి. వారి కుటుంబాలను పరామర్శించడం కోసం.. జగన్ ‘ఓదార్పు యాత్ర’కు శ్రీకారం చుట్టారు. దీనికి కాంగ్రెస్ పెద్దలు సమ్మతించలేదు. విజయమ్మ ఢిల్లీ వెళ్లి కోరినా ఫలితం కనిపించలేదు. కాంగ్రెస్ హైకమాండ్‌తో విబేధించిన జగన్.. ధైర్యంగా అడుగు ముందుకేసి.. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన వారి కుటుంబీకులను ఓదార్చడం కోసం ‘ఓదార్పు యాత్ర’ ప్రారంభించారు. మీరంతా నా కుటుంబ సభ్యులేనని వారిలో భరోసా నింపారు. 2010లో కాంగ్రెస్‌కు, పదవులకు రాజీనామా చేసిన జగన్, విజయమ్మ.. తన తండ్రి పేరు కలిసొచ్చేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశారు. ప్రభుత్వంపై జగన్ అవిశ్వాస తీర్మాన ప్రవేశపెట్టగా.. 17 మంది ఎమ్మెల్యేలు ఆయనకు అండగా నిలిచారు. వారిపై అనర్హత వేటు పడటంతో.. ఉపఎన్నికల్లో గెలిపించుకున్నారు. తర్వాత జగన్‌పై రకరకాలుగా ఒత్తిడి పెరిగింది. కానీ స్వతహాగా మొండి వాడయిన జగన్ వెనక్కి తగ్గలేదు. దీంతో అతడిపై అక్రమాస్తుల కేసులు నమోదయ్యాయి. సీబీఐ, ఈడీ విచారణలతో జగన్‌ను ఇబ్బంది పెట్టారు. లక్ష కోట్ల అక్రమాస్తులంటూ మీడియాలో వార్తలు, ఆస్తుల అటాచ్‌మెంట్, 16 నెలల జైలు జీవితం. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్న బెయిల్ లభ్యం కాలేదు. కష్ట సమయంలో ఆయనకు తల్లి విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిల అండగా నిలిచారు. 

 

2014 ఎన్నికల్లో జగన్ వస్తాడని బలంగా నమ్మినప్పటికీ.. చంద్రబాబు, మోదీ, పవన్ కళ్యాణ్ కూటమి బలం ముందు స్వల్ప తేడాతో జగన్ అధికారానికి దూరమయ్యారు. తన మాస్ ఇమేజీకి, వ్యూహరచన తోడు కావాలని భావించిన జగన్.. ప్రశాంత్ కిశోర్ టీం సలహాలు కోరారు. ఇది వైఎస్ఆర్సీపీకి మేలు చేసింది. రాష్ట్ర విభజన సమయంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ‘సమైక్యాంధ్ర’ కోసం నినదించిన జగన్.. రాష్ట్రం ఏర్పాటయ్యాక.. ప్రత్యేక హోదా కోసం గళం వినిపించారు. తమకు హోదా మాత్రమే కావాలని, ప్యాకేజీ వద్దని డిమాండ్ చేశారు. అదే సమయంలో.. వైఎస్ఆర్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి ఫిరాయించారు. 2019 ఎన్నికల్లోనూ ఓడిపోతే వైఎస్ఆర్సీపీ కనుమరుగయ్యే పరిస్థితి. ఈ తరుణంలో జగన్ జనాన్ని నమ్ముకున్నారు. తన తండ్రి చూపిన బాటలో పయనించి.. ఎన్నికలు సుదూరంగా ఉండగానే పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. 341 రోజులపాటు 113 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా.. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 3648 కి.మీ. పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో 2 కోట్ల మందికిపైగా ప్రజలను ప్రత్యక్షంగా కలిశారు. 36 ఏళ్ల వయసులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన జగన్.. ఈ పదేళ్ల రాజకీయ జీవితంలో మరే ఇతర నాయకుడూ ఎదుర్కొని ఇబ్బందులు పడ్డారు. చివరకు 2019 ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించి సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిజమైన రాజకీయ వారసుడిగా పేరు నిలబెట్టుకున్నారు. కానీ లోకేష్ లో ఆ పోరాట పటిమ లేదనే వార్తలు తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా వినిపిస్తోంది. దీంతో చంద్రబాబు తన రాజకీయ వారసుడు లోకేశ్ అని గట్టిగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: