2019 ఎన్నికలకు ముందు జగన్ చాలాపెద్ద ప్లాన్ వేసుకున్నారు. ఎలాగో దేశంలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఎన్డీఏ అధికారంలోకి రావాలి అంటే ఎన్డీఏ లోని పార్టీలతో పాటు మిగతా పార్టీల సపోర్ట్ కూడా అవసరం అవుతుంది. ఒకవేళ దేశంలో ఎన్డీయేకు సపోర్ట్ అవసరమైన, యుపిఎకు సపోర్ట్ అవసరమైన వైకాపా వద్దకు వస్తుంది. అప్పుడు ఎవరూ ప్రత్యేక హోదాను ఇస్తామని అంటే వాళ్లకు సపోర్ట్ చెయ్యాలి అని భావించింది వైకాపా.
కానీ, ఎన్నికలు జరిగి రిజల్ట్ వచ్చిన తరువాత వైకాపాకు దిమ్మతిరిగింది. వైకాపా అనుకున్నట్టుగా కేంద్రంలో బీజేపీకి పెద్దగా సపోర్ట్ అవసరం లేకుండానే అధికారంలోకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మొత్తమ్మీద 308 స్థానాల్లో విజయం సాధించింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు అవకాశం ఉన్నప్పటికీ పార్టీ ఎన్డీయేలో భాగస్వామ్యం ఉన్న పార్టీలకు కూడా అవకాశం కల్పించింది.
కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావడంతో మనతో అవసరం లేదని చెప్పిన జగన్, ప్రత్యేక హోదా విషయాన్నీ తాత్కాలికంగా పక్కన పెట్టారు. ఇక జగన్ మొదట్లో కేంద్రంతో జరిగిన ప్రతి కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని పేర్కొన్నారు. కానీ, ఇప్పటికే కేంద్రం హోదా విషయంలో క్లారిటీ ఇచ్చింది. ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే సమస్య లేదని ఇప్పటికే స్పష్టం చేశారు.
కాగా, ఇప్పుడు వైకాపా ఎన్డీయేలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం. జగన్ ఇప్పటికే కేంద్రానికి సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది వైకాపా ఎన్డీయేలో చేరే అవకాశం ఉన్నది. ఇప్పటి వరకు రాజ్యసభలో నలుగురు ఎంపీలు ఉన్నారు. వచ్చే ఏడాది మరో రెండు ఎంపీలు పెరిగే అవకాశం ఉన్నది. మొత్తంగా ఆరుగురు ఎంపీలు ఉండే అవకాశం ఉన్నది. వైకాపా ఎన్డీఏలో చేరితే... వైకాపాకు రెండు మంత్రి పదవులు, డిప్యూటీ స్పీకర్ పదవి లభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.