చంద్రబాబునాయుడును కాపాడటం కోసం పాపం ఏబిఎన్-ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ పడుతున్న పాట్లు అంతా ఇంతా కాదు. అసలు బలమే లేని చంద్రబాబును సొంత వ్యక్తిత్వం లేని చినబాబు నారా లోకేష్ ను పైకెత్తటానికి రాధాకృష్ణ ఎన్ని జాకీలేసినా ఉపయోగం కనబడటం లేదు. అధికారంలో ఉన్న ఐదేళ్ళు చంద్రబాబు గురించి ఆహో ఓహో అంటూ ఎల్లోమీడియా ఎంతగా గొంతు చించుకున్నదీ అందరూ చూసిందే.
ఐదేళ్ళ పాటు చంద్రబాబులోని లోపాలను బయటపడకుండా, అరాచకపాలనను జనాలకు తెలీకూడదని ఎల్లోమీడియా ఎంతో ఇబ్బంది పడింది. కానీ చివరకేమైంది ? జగన్మోహన్ రెడ్డికి అఖండ మెజారిటిని కట్టబెట్టి జనాలు చంద్రబాబు, ఎల్లోమీడియాకు ఒకేసారి షాకిచ్చారు. నిజానికి జనాలిచ్చిన షాక్ చంద్రబాబుకన్నా ఎల్లోమీడియాకే ఎక్కువ తగిలింది.
తగిలిన దెబ్బ నుండి చంద్రబాబు లాగే ఎల్లోమీడియా కూడా ఇంకా కోలుకోలేదు, గుణపాఠాలు కూడా నేర్చుకోలేదు. అందుకనే ఆరుమాసాల జగన్ పాలనపై బురద చల్లటమే ఏకైక లక్ష్యంగా పెట్టుకుని కథనాలు అచ్చేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో జగన్ కు మద్దతుగా నిలిచిన వివిధ సామాజికవర్గాలను దూరం చేయటానికి చాపక్రింద నీరులాగ ప్రయత్నాలు మొదలుపెట్టారు రాధాకృష్ణ. చంద్రబాబు ఆదేశాలను నేతలు పట్టించుకోవటం లేదు కాబట్టి ఆ పనిని కూడా రాధాకృష్ణే భుజానికెత్తుకున్నట్లు కనిపిస్తోంది.
ఇక్కడ ఎల్లోమీడియా గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబు, జగన్ వ్యక్తిత్వాలను భేరీజు వేసుకున్న తర్వాతే జనాలు వైసిపికి మొన్నటి ఎన్నికల్లో పట్టంకట్టారు. అంటే చంద్రబాబును తిరిగి అధికారంలోకి తీసుకురావాలన్న ఎల్లోమీడియా ప్రయత్నాలను జనాలు తిప్పికొట్టారు.
బిజెపి-జగన్ మధ్య గొడవలు పెడితేనో లేకపోతే కేసియార్ కు జగన్ కు చెడిందని కథనాలు వండి వారుస్తేనో జనాలు నమ్మి మళ్ళీ చంద్రబాబుకు మద్దతుగా నిలుస్తారని రాధాకృష్ణ ఎలా అనుకుంటున్నారో అర్ధం కావటం లేదు. పరిపాలనలో జగన్ ఫెయిలయ్యారని జనాలు భావిస్తే మాత్రమే ప్రత్యామ్నాయంవైపు చూస్తారన్న విషయాన్ని మరిచిపోయి జగన్ పై బురద చల్లాలని ప్రయత్నిస్తే జనాలు ఎల్లోమీడియాకు ఇంకోసారి బుద్ధి చెప్పటం ఖాయం.